ట్రాక్ పైన ప్రేమికుడు, రైలు డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తి

మంగళవారం, 13 జులై 2021 (10:07 IST)
ఎపుడూ య‌ధాలాపంగా రైలు న‌డిపే ఇంజ‌న్ డ్రైవ‌ర్, ఎందుకో ట్రాక్ వైపు నిశితంగా దృష్టి పెట్టాడు. అక‌స్మాత్తుగా ఓ యువ‌కుడు రైల్వే ట్రాక్ పైకి వ‌చ్చేసి, ప‌ట్టాల‌పై అడ్డంగా ప‌డుకున్నాడు. అంత స్పీడులోనూ డ్రైవ‌ర్ స‌డ‌న్ బ్రేక్ వేశాడు. అంతే, ఆ యువ‌కుడికి ప్రాణాపాయం త‌ప్పి, గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. 
 
ఏపీ సీఎం నివాసం ఉండే, తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అక్క‌డి రైల్వే ట్రాక్ పైన ఓ యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ట్రైన్ డ్రైవర్ బ్రేక్ వేయటంతో ప్రాణాపాయం తప్పింది.

ఆ యువ‌కుడిని అదే ట్రైన్‌లో విజయవాడకు తరలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపారు. యువ‌కుడి రెండు కాళ్ళ‌కు గాయాల‌య్యాయి. ఆ యువ‌కుడు నులకపేటకు చెందిన పృథ్వీగా గుర్తించారు.

ప్రేమ విఫ‌ల‌మై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేందుకు ట్రాక్ పైకి వ‌చ్చాడ‌ని తెలుస్తోంది. పృధ్వి ప్ర‌స్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు