అల్పపీడనంగా మారుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి

శుక్రవారం, 27 జనవరి 2023 (17:17 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతోంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర తెలిపింది. 
 
ఆగ్నేయ బంగాళాఖాతంలోని తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. ఇది శుక్రవారానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ఈ అల్పపీడనం మూడు రోజుల పాటు నెమ్మదిగా కదులుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 
 
ఈ అల్పపీడనం ప్రభాకం కారణంగా ఈ నెల 29, 30వ తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 
సాధారణంగా జనవరి మొదటివారంలో తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడవు. కానీ, ఇపుడు సముద్రంపై తేమ అధికంగా ఉండటంతో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడటానికి కారణం అవుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఏపీలోని చలి తీవ్రతో కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాలయసీమ ప్రాంతాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు