ఆ యువకుడికి వివాహమై కేవలం నాలుగు రోజులు మాత్రమే అయింది. కాళ్ళపారాణి కూడా ఇంకా ఆరనేలేదు. కానీ అంతలోనే పరాయి మహిళ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధం కారణంగానే వరుడు ఈ దారుణానికి పాల్పడివుంటాడని స్థానికులు చెపుతున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
నక్కపల్లి మండలం చినతీనార్ల శివారు ఎగుదలపేట గ్రామానికి చెందిన కోశెట్టి శ్రీను కొబ్బరి బోండాల హోల్సేల్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చాడు. ఈయనకు విశాఖ నగరంలోని మధురవాడ ప్రాంతం పీఎంపాలేనికి చెందిన గుత్తుర్తి రమణ కుమార్తె వరలక్ష్మితో ఈ నెల 23వ తేదీ బుధవారం రాత్రి ఎగుదలపేటలో వివాహం జరిగింది. ఇంకా వధువు ఇంటికి రాకపోకలు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శ్రీను చినతీనార్లలో ఒక మహిళ ఇంటికి వెళ్లాడు.
అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ శ్రీను ఆమె ఇంటిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అతని కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లారు. శ్రీనును కిందకు నక్కపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ ఎల్.రామకృష్ణ, శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మహిళ భయపడి... ఫ్యాన్కు ఉరి వేసుకున్న శ్రీనును కిందకు దించాక అదే ఫ్యాన్కు ఉరేసుకోవడానికి యత్నించింది. అదేసమయంలో అక్కడకు చేరుకున్న ఎస్ఐ రామకృష్ణ, హెచ్సీ రెడ్డి వెంటనే ఆమెను కిందకు దించారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.