లాన్స్ నాయక్ సాయి తేజ కుటుంబానికి ప్రభుత్వ అండ

శనివారం, 11 డిశెంబరు 2021 (18:07 IST)
హెలికాఫ్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన సైనికాధికారుల్లో ఒకరైన మన రాష్ట్రానికి చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబాన్నిడిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌ లు పరామర్శించారు. శనివారం చిత్తూరుజిల్లా కూరబలకోట మండలం రేగడ లో సాయితేజ నివాసంలో ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అనంతరం రాష్ట్రప్రభుత్వం తరుఫున ఆర్థిక సహాయంకు సంబంధించిన చెక్‌ను లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి అందచేశారు. 
 
 
రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ,  అమరవీరుడి కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం వైయస్ జగన్ ప్రత్యేకంగా తెలియచేశార‌ని చెప్పారు. అదే విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించి, వారికి ధైర్యం చెప్పామని అన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన వారి త్యాగాలకు వెలకట్టలేమని అన్నారు. ఆ కుటుంబాలకు ఏమిచ్చినా వారి త్యాగాలకు సాటిరావని చెప్పారు. 27ఏళ్ళ చిన్న వయస్సులోనే లాన్స్‌నాయక్ సాయి తేజ ప్రాణాలను కోల్పోవడం బాధాకరమని అన్నారు.  స్వర్గీయ సాయితేజ వీరమరణం పొందారని, దేశం యావత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరులను తలుచుకుని నివాళులు అర్పించిందని గుర్తు చేశారు. 
 
 
దు:ఖంతో ఉన్న సాయితేజ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగిందని, వారి పరిస్థితిని స్వయంగా చూసిన తరువాత ఆ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున అండగా నిలవడం, కుటుంబసభ్యులకు చేయూతను అందించే విషయాలపై  సీఎం శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకువెడతామని అన్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం శ్రీ నారాయణస్వామి మాట్లాడుతూ దేశం గర్వించేలా లాన్స్‌నాయక్ విధి నిర్వహణలో అమరుడయ్యాడని అన్నారు. ఆయన మరణం అందరిలోనూ విషాదాన్ని నిపిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు