మినిట్స్ బయటపెడితే ఎవరిది తప్పో తెలుస్తుంది: టీడీపీ ఎమ్మెల్సీ పీ.అశోక్ బాబు

గురువారం, 2 జులై 2020 (23:33 IST)
ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు రాకపోవడానకి కారణం, టీడీపీ సభ్యులేనని ప్రభుత్వం చెప్పడం, మండలిలో ప్రతిపక్ష సభ్యులే ద్రవ్య వినిమయ  బిల్లుని అడ్డుకున్నారని ప్రసారమాధ్యమాల్లో, సోషల్ మీడియాలో విషప్రచారం చేయడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండి పడ్డారు.

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలిలో ఏం జరిగిందో తెలియాలంటే, మినిట్స్ బయట పెట్టాలన్నారు. బడ్జెట్ సమావేశాల పేరుతో కేవలం రెండు రోజులకే సభల నిర్వహణను పరిమితం చేసిన ప్రభుత్వం, బాధ్యతారహితంగా, దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు సహా, 16 బిల్లులను ప్రభుత్వం మండలికి పంపిందని, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కూడా జరగకుండా చేసిందన్నారు.

ప్రభుత్వం గవర్నర్ తో మాట్లాడించాలి కాబట్టి మాట్లాడించిందని, రెండోరోజు సాయంత్రం 4 గంటలకు బడ్జెట్ ను మండలికి పంపారని అశోక్ బాబు తెలిపారు. రాజధానికి చెందిన బిల్లులు, ఇంగ్లీషు మీడియం, ఆక్వా రైతుల బిల్లుల వంటివి కూడా వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో మూడురాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు కోర్టు పరిధిలో ఉన్నందున మిగతా వాటిపై చర్చిద్దామని తీర్మానించి 9 బిల్లులను మండలి ఆమోదించడం జరిగిందన్నారు.

బడ్జెట్ బిల్లు వచ్చేలోగా మిగతా బిల్లులు చర్చిద్దామన్న టీడీపీ నిర్ణయానికి లీడర్ ఆఫ్ ది హౌస్ సుబాష్ చంద్రబోస్ కూడా ఛైర్మన్ సమక్షంలో అంగీకరించడం జరిగిందని అశోక్ బాబు చెప్పారు. బడ్జెట్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు సభలోకి వచ్చాక ఫైనాన్స్ మినిస్టర్ వాటికి సంబంధించిన మోషన్ మూవ్ చేస్తుంటే, బొత్స సత్యనారాయణ ఆయన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు.

అక్కడి నుంచే గలాటా ప్రారంభమైందని, వరుసక్రమంలో బిల్లులు రాకుండా బొత్స అడ్డుకోవడం జరిగిందని టీడీపీ నేత మండిపడ్డారు. మూడురాజధానులు, సీఆర్డీఏరద్దు బిల్లులపై చర్చ జరగాలని బొత్స మంకుపట్టు పట్టాడని, కోర్టు పరిధిలో ఉన్న బిల్లులపై చర్చ ఎలా సాధ్యమవుతుందని చెప్పినా వినలేదన్నారు. బొత్స తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఛైర్మన్ లాబీలోకి వెళ్ళడం కూడా జరిగిందన్నారు.

ఇది బడ్జెట్ సెషన్ కాబట్టి ముందు ద్రవ్య వినిమయ బిల్లుని చర్చిద్దామని టీడీపీ చెప్పినా ఖాతరు చేయకుండా 20 మంత్రులు మండలిలో వీరంగం వేశారన్నారు. ఇవన్నీ బయటకు రావాలంటే మండలి మినిట్స్ బహిర్గతం చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

ఇంకోరోజు అదనంగా కూర్చుని అయినా సరే బడ్జెట్ బిల్లుని చర్చిద్దామని టీడీపీ సభ్యులు చెప్పినా, మంత్రులు బూతులతో నానాయాగీ చేశారన్నారు. బీహార్, తమిళనాడులో కుర్చీలు విసిరారు.. చొక్కాలుచించుకున్నారని ఎప్పుడో చదివామని, అంతకన్నా దారుణంగా బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు ప్రవర్తించారన్నారు. 

ఆర్టికల్ 197 కింద ప్రభుత్వానికి ద్రవ్యవినిమయ బిల్లుని ఆమోదించుకునే అధికారం ఉన్నప్పుడు, టీడీపీ సభ్యులపై పడి ఏడవడం దేనికని అశోక్ బాబు ఎద్దేవాచేశారు. ఏదైనా బిల్లుకి సవరణలు ప్రతిపాదించడం, తిరస్కరించడం, పెండింగ్ పెట్టే అధికారం కౌన్సిల్ కి ఉంటుందనే విషయాన్ని కూడా వైసీపీ నేతలు, మంత్రులకు తెలియకపోవడం విచారకరమన్నారు.

అసెంబ్లీకి ఉండే అధికారాలు అసెంబ్లీకి ఉంటే, మండలి అధికారాలు మండలికి ఉంటాయని, ఎవరి హక్కులు వారు సక్రమంగా వినియోగించుకోవాలనే ఇంగితం కూడా వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదించకపోతే ఇబ్బందులు వస్తాయని టీడీపీ చెప్పినా వినకుండా, మంత్రులు మండలిలో కావాలనే అడ్డుకున్నారన్నారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చిద్దామని టీడీపీ సభ్యులు వందసార్లు చెప్పారని, చెప్పారో లేదో తెలియాలంటే మినిట్స్ బహిర్గతం చేయాలన్నారు. ప్రభుత్వ బిల్లులు కాకుండా ప్రైవేట్ బిల్లులు పెట్టే అవకాశం ప్రభుత్వానికి లేదని, బడ్జెట్ బిల్లు ప్రభుత్వ బిల్లు కాదు, సీఆర్డీఏ రద్దు, 3రాజధానుల బిల్లులే ప్రభుత్వ బిల్లులనే విచిత్ర వాదనకూడా మంత్రులు చేశారన్నారు.

ప్రభుత్వం పెట్టినవన్నీ ప్రభుత్వ బిల్లులేనని, రెండురోజుల్లో ప్రైవేట్ బిల్లులు పెట్టడం అసాధ్యమన్నారు. మండలిలో టీడీపీ సభ్యులు తప్పు చేశారని రుజువైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అశోక్ బాబు ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

బడ్జెట్ ఫైనాన్స్ బిల్లు కాబట్టి, కౌన్సిల్ ఆమోదించినా, ఆమోదించకపోయినా 15 రోజుల తర్వాత దాన్నిచట్టంగా మార్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉందన్నారు. బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందకపోవడానికి ముమ్మాటికి ప్రభుత్వమే కారణమని అశోక్ బాబు తేల్చిచెప్పారు.   

ఉద్యోగులపై అంత ప్రేమాభిమానాలుంటే సీపీఎస్ ఎందుకు రద్దు చేయరు? 
ప్రభుత్వానికి నిజంగా ఉద్యోగులపై అంతటి ప్రేమాభిమానాలే ఉంటే, వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్, ఇప్పటివరకు రద్దు చేయలేదని, ముందు ఆపనిని చేసి చూపించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

డిసెంబర్ దాకా పీఆర్సీ ఇవ్వలేమంటున్నారని, తక్షణమే పీఆర్సీని విడుదలచేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల, 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. ఒకటి రెండు రోజులు జీతాలు ఆలస్యమైతే, దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడటం వైసీపీ ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

ఎగువసభకు ఉండే అధికారాలు దానికి ఉంటే, దిగువసభ సభ్యులను చులకనగా చూడటం, చెప్పింది వినాలి, పెట్టమన్నచోట సంతకాలు పెట్టాలి అని వైసీపీ వాళ్లు మాట్లాడటం అనాగరికమని టీడీపీనేత ఆగ్రహం వ్యక్తంచేశారు.

మండలికి అంత విలువ లేదని భావించే ప్రభుత్వం తమసభ్యులను అక్కడికి పంపడానికి, ఎందుకు ఆరాటపడుతోందని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ ను కూడా కులాలవారీగా విడగొట్టారని, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ లేకుండా చేశారన్నారు.

అసెంబ్లీలో ఉండేవాళ్లు సభా సంప్రదాయాలు పాటించకపోయినా, మండలిలో తామంతా వాటికి అనుగుణంగానే నడుచుకుంటామన్నారు.

ఆర్టికల్ – 197 ప్రకారం ప్రభుత్వానికి అధికారాలుంటే వాటిని వినియోగించుకోకుండా, మండలి వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం, టీడీపీపై అపవాదు వేయడం వైసీపీ అసమర్థతేనన్నారు. అవినీతి అనే పడవలో ప్రభుత్వం ప్రయాణిస్తోందని, అది త్వరలోనే మునిగిపోతుందన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మండలిలో ఏం జరిగిందో తెలియాలంటే మినిట్స్ బయటపెట్టాలన్నారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదంలో ప్రభుత్వమే విఫలమైందన్నారు. 

విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కామెంట్లు పెడితే, మండలి రద్దు కాదని, ఆయన కోరలు పీకారని, వేళ్లు కత్తిరించారని, ఆయన్ని 10వ స్థానానికి పరిమితం చేశారని, పవర్ తగ్గించారని రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయని, ఆయన తన స్థానమేంటో తెలుసుకున్నాక మండలిరద్దు, ప్రతిపక్షం గురించి మాట్లాడితే బాగుంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు