విజయవాడ అయోధ్యనగర్లో ఈ నెల 20న అదృశ్యమైన మహిళ మంత్రి ఈశ్వరమ్మ (33) ఆమె కుమార్తె రాధ(11), కుమారుడితో కలసి రైల్వే గేటు పక్కన సూర్యకాలనీలో జీవనం సాగిస్తుండే వారు. మంత్రి ఈశ్వరమ్మ భర్త అప్పలనాయుడు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.
20వ తేదీ ఉదయం నుంచి ఇంట్లో కనిపించడం లేదు. ఇదిలా ఉండగా, తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం కృష్ణా రైల్వే బ్రిడ్జి దిగువన కృష్ణానదిలో గురువారం రైల్వే బ్రిడ్జి కింది భాగంలో 7వ ఖానా వద్ద ఒక మహిళ, ఒక బాలిక మృతదేహాలను మత్య్సకారులు గుర్తించారు. సమాచారం విజయవాడ పోలీసులకు ఇవ్వడంతో ఈశ్వరమ్మ మరిది వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆమెకు ఆరోగ్యం సరిగాలేదని యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లతో ఎలా బతకాలి అని ఆలోచించి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అయితే కుమార్తె రాధిక మృత దేహాన్ని పరిశీలిస్తే ఈ మరణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. బాలిక నాలుక బైటకు వచ్చి పల్లతో పట్టేసి ఉంది. ఇది నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదే అయితే ఇలా ఉండదు.
ఉరి వేసుకున్నప్పుడో, గొంతు నులిమి చంపినప్పుడో మాత్రమే ఇలా నాలుక బైటకు వస్తుందని శవ పరీక్ష నిపుణులు చెబుతున్నారు. తల్లి ఈశ్వరమ్మ కూతురు రాధికను గొంతు నులిమి కృష్ణా నదిలోకి పడేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఎవరైనా తల్లిని ముందు నదిలో తోసి కుమార్తె గొంతు నులిమి హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.