మళ్లీ సినిమా థియేటర్లు మూత?

బుధవారం, 24 మార్చి 2021 (12:49 IST)
సినిమా థియేటర్లు మళ్లీ మూతపడక తప్పదా? పెరుగుతున్న కరోనా కేసులు సినీ పరిశ్రమను దెబ్బతీయనున్నాయా? కొన్ని సినిమాల విడుదల వాయిదా పడడం దేనికి సంకేతం? కరోనా ప్రభావంతో 2020లో  సినిమా రంగం భారీగా నష్టపోయింది.

టాలీవుడ్‌లో 9 నెలలపాటు సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా రంగం కోలుకోలేని విధంగా దెబ్బతింది. అయితే కరోనా ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది సంక్రాంతి నుంచి మళ్లీ టాలీవుడ్‌లో సినిమాల సందడి మొదలైంది. కొత్త సినిమాల విడుదల ప్రారంభమైంది. కలెక్షన్లు కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి.
 
మాస్టర్, క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, నాంది వంటి సినిమాలు సక్సెస్ అందుకోవడంతో రాబోయే సినిమాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కరోనా సెకండ్ వేవ్‌పై వస్తున్న వార్తలు నిర్మాతల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

కర్నాటకలో థియేటర్లకు ఇప్పటికీ అక్కడి ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వలేదు. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది. మహారాష్ట్రలో అయితే అసలు జనాలు థియేటర్లకు రావడమే మానేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అలాంటి పరిస్థితులు రాకపోయినా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రంగ్ దే, అరణ్య, తెల్లవారితే గురువారం వంటి చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. మొత్తానికి కరోనా మహమ్మారి చిత్రసీమను మరోసారి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు