డ్రైవర్ సీటులో హరికృష్ణ.. కారు వేగం 160 కి.మీ... వాహనమెక్కితే చేతిలో స్టీరింగ్ ఉండాల్సిందే...

బుధవారం, 29 ఆగస్టు 2018 (09:08 IST)
నల్గొండ జిల్లాలో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ హీరో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. ఆయనే స్వయంగా కారును అమిత వేగంతో నడపుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో 160 కిలోమీటర్ల వేగంతో స్వయంగా కారును నడుపుతూ ఉండటం నందమూరి హరికృష్ణ మరణానికి కారణమైనట్టు తెలుస్తోంది. ప్రమాదంలో కారు పల్టీలు కొట్టగా, హరికృష్ణ ఛాతీ స్టీరింగ్‌కు బలంగా తగిలిందని, ఆపై ఆయన కారులోంచి కిందపడగా, బలమైన గాయమై మెదడు చిట్లిందని వైద్యులు చెబుతున్నారు.
 
ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని, అత్యవసర వైద్య చికిత్సలు చేసినా ఆయన ప్రాణాలు నిలబడలేదని, ఉదయం 7:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారని తెలిపాయి. అయితే, హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఆసుపత్రికి చేరుకున్న తర్వాతే, హరికృష్ణ మృతి వార్తను వైద్యులు అధికారికంగా ప్రకటించారు. 
 
నిజానికి అది కారుగానీ, వ్యాన్ గానీ, లారీగానీ... ఏదైనా సరే నడపడంలో సిద్ధహస్తుడు నందమూరి హరికృష్ణ. నాడు తన తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన వేళ, చైతన్య రథానికి సారథిగా నిలిచి వేల కిలోమీటర్ల దూరాన్ని అత్యంత సునాయాసంగా నడిపారు. ఎక్కడికైనా ప్రయాణాలు పెట్టుకున్నా, ఎవరి ఇంటికైనా బయలుదేరినా, స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకోవడం ఆయనకున్న అలవాటు. అదే అలవాటు ఇప్పుడాయన ప్రాణాలు తీసింది.
 
కారును ఎంత వేగంగానైనా అత్యంత చాకచక్యంగా నడిపే ఆయన కారు ప్రమాదానికి గురైందంటే, అభిమానులు నమ్మలేకున్నారు. తన కుమారుడు ఎన్టీఆర్‌ను కారులో పక్కన కూర్చోబెట్టుకుని హరికృష్ణ కారును నడుపుతూ రావడం ఎన్నోమార్లు మీడియాకు కనిపించింది. వాహనం నడపటం తనకెంతో ఇష్టమైన పనని చెప్పే ఆయన, తన సొంత ఫార్చ్యూనర్ కారు ఏపీ 28 బీడబ్ల్యూ 2323లో వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఇంత ఘోరాన్ని నమ్మలేకున్నామని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు