కనిగిరి కీచకపర్వంపై కన్నీళ్లు పెట్టుకున్న నన్నపనేని.. వీధికుక్కల్లా, ఊరకుక్కల్లా..?

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (09:18 IST)
కనిగిరి కీచకపర్వంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. మహిళలపై అఘాయిత్యాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని నన్నపనేని.. కన్నీళ్లు పెట్టుకున్నారు. కనిగిరిలో అమ్మాయి పట్ల దుర్మార్గులు వీధికుక్కల్లా, ఊరకుక్కల్లా ప్రవర్తించారు. ముగ్గురు మగోళ్లు కలిసి ఈ దృశ్యాలను వీడియో తీయడం ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
డిగ్రీ చదువుతున్న అమ్మాయి పెళ్లికి నిరాకరించిన కారణంతో ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడటం దారుణం అని నన్నపనేని అన్నారు. క్రూర మృగాల్లాగా, మానవత్వం నశించే విధంగా, నీచాతి నీచమైన ఈ సంఘటనతో సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఉందని ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని.. బెయిల్ కూడా ఇవ్వకూడదన్నారు.  
 
కాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారానికి ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పట్టణానికి చెందిన ఓ విద్యార్ధిని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. అదే కళాశాలలో కార్తీక్‌ అనే విద్యార్థితో గత రెండేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల ఆమె కార్తీక్‌ స్నేహితుడైన సాయిరామ్‌తో సన్నిహితంగా ఉంటోంది. దీన్ని కార్తీక్‌ జీర్ణించుకోలేకపోయాడు. 
 
మూడు రోజుల క్రితం ఆమెను పట్టణ శివారులోని కాశీనాయని గుడి వద్దకు రమ్మన్నాడు. ఆమె తన స్నేహితురాలితో అక్కడికి వెళ్లగా అప్పటికే అక్కడ కార్తీక్‌తోపాటు ఆయన స్నేహితులు సాయిరాం, శ్రీరాంపవన్‌ ఉన్నారు. వీరంతా కలిసి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. కార్తీక్ ఉసిగొల్పడంతో సాయిరామ్ ఆ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అరగంట పాటు శారీరకంగా హింసించాడు. 
 
కాగా, బాధిత విద్యార్థినిపై అత్యాచారయత్నం దృశ్యాలను తన మిత్రుల సాయంతో సెల్ ఫోన్ లో రికార్డు చేసిన నిందితుడు కార్తీక్, తాను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించాడు. అంతేగాకుండా చెప్పినట్లే ఆ పని పూర్తి చేసాడు. ఈ సంఘటనలో కార్తీక్ సహా అతనికి సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు