అధికారంలోకి వచ్చిన కూటమి.. తామే గెలిచామన్న సంతోషంలో ప్రజలు : నారా భువనేశ్వరి

వరుణ్

మంగళవారం, 18 జూన్ 2024 (17:31 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. నిజం గెలవాలి పర్యటనలో తాను ప్రజల బాధలు చూశానని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషాన్ని చూశానని పేర్కొన్నారు. 
 
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి అన్నీ మంచిరోజులే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువుదీరనున్న గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుతుందని స్పష్టం చేశారు. ఇపుడు రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా మట్లాడుతూ.. తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ.. తాము పడిన క్షోభపై గళం విప్పుతున్నారని తెలిపారు. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై ధైర్యంగా ఉన్నారని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తుండటం తమ మనసుకు సంతోషాన్నిస్తోందని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుందని, రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయన్నారు. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుందని తేల్చి చెప్పారు. 
 
ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నేరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన ఫొటోలను భువనేశ్వరి ట్వీట్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు