నవంబరు ఒకటో తేదీ నుంచి "భవిష్యత్‌కు గ్యారెంటీ"

శనివారం, 21 అక్టోబరు 2023 (17:48 IST)
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. నిజానికి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టారు. అయితే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయన అరెస్టయి రాజమండ్రి జైలులో ఉంటున్నారు. దీంతో ఈ కార్యక్రమంతో పాటు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కూడా ఆగిపోయింది. ఇపుడు నారా లోకేశ్ ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించనున్నారు. 
 
ఈ మేరకు శనివారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం ఐదు గంటల పాటు జరిగింది. ఇందులో నవంబరు ఒకటో తేదీ నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ కార్యక్రమం నంద్యాలలో ఆగిపోయింది. తిరిగి అక్కడ నుంచే నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఇందులో చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు భవిష్యత్‌కు గ్యారెటీ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 
 
అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇది వారంలో మూడు రోజుల పాటు సాగనుంది. ఇందులో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతారు. ఇందుకోసం ఆమె బస్సు యాత్రను చేపడుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు