జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు లేవు.. పవన్‌తో సత్సంబంధాలున్నాయ్: నారా లోకేశ్

గురువారం, 3 ఆగస్టు 2017 (09:12 IST)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సత్సంబంధాలున్నాయని నారా లోకేశ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం పని చేసేందుకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు.

అమరావతిలో నారాలోకేశ్ మాట్లాడుతూ.. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం పూర్తి అవుతాయని వెల్లడించారు. తమ ఉనికి కోసమే బీజేపీతో కలుస్తామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. బీజేపీతో తమకు ఎటువంటి విభేదాలు లేవని లోకేశ్ చెప్పుకొచ్చారు.
 
ఇక అభివృద్ధి విషయంలో రాయలసీమను తాము ఎప్పుడూ చిన్నచూపు చూడలేదన్నారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. దుష్ప్రచారం చేసే వాళ్లు చేస్తూనే ఉంటారు. ఇటీవల ఓ దుష్ప్రచారం చేశారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పంపించి వేస్తున్నామని ప్రచారం చేశారు. అసలు ఈ విషయమై ఓ జీవో, డిస్కషన్ ఏదీ జరగలేదన్న విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి