ఒత్తిడి భరించలేక విశాఖలో నీట్ విద్యార్థిని సూసైడ్

ఆదివారం, 15 జులై 2018 (14:07 IST)
ఒత్తిడి భరించలేక విశాఖలో ఓ నీట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. విశాఖపట్నం శివార్లలోని అశీలుమెట్ట వద్ద గ్రావిటీ ఐఐటీ-మెడికల్ అకాడమీలో లాంగ్ టర్మ్ కోచింగ్ నిమిత్తం 9వ తేదీన చేరిన అమృత (17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయనగరం జిల్లాకు చెందిన రైతు మర్రి సాంబమూర్తి, అంగన్ వాడీ కార్యకర్త సుధారాణి దంపతుల కుమార్తె అమృత. ఆమెను డాక్టర్‌ను చేయాలన్న లక్ష్యంతో ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఆదివారం ఉయం స్నానం చేసి, దుస్తులు మార్చుకుని వస్తానని స్నేహితులతో చెప్పిన అమృత, లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. ఆపై ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె ఉరేసుకుని చనిపోయింది. ఆమెకు హాస్టల్ నివాసం కొత్తేమీ కాదని తెలుస్తోంది. 8 నుంచి ఇంటర్ వరకూ అమృత హాస్టల్‌లోనే ఉండి చదువుకుంది. తెలుగు మీడియంలో చదివిన అమ్మాయి, నీట్ కోచింగ్ ఇంగ్లీష్ మీడియంలో సాగుతుండటంతో ఒత్తిడిలో పడ్డట్టు తెలుస్తోంది. ఆమె రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు