టీడీపీకి ఓటు వేశారనీ అఘాయిత్యం చేయించారు.. వైకాపా నేతల దాష్టీకం

ఠాగూర్

బుధవారం, 18 సెప్టెంబరు 2024 (12:46 IST)
గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అనేక దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిలో ముంబై నటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు బనాయించారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇపుడు మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారన్న అక్కసుతో ఓ యువతిపై వైకాపా నేతలు అత్యాచారం చేయించారు. ఈ విషయం టీడీపీ ఆఫీస్‌లో నిర్వరించిన గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
 
మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్టీనేత పీలా గోవింద్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులకు అండగా ఉండి, న్యాయం చేస్తామని, సమస్యలు పరిష్కారిస్తామని నేతలు హామీలిచ్చారు. తాము టీడీపీకి ఓట్లేశామన్న కక్షతో అనుమోలు వెంకటేశ్వర్లు, లక్ష్మీనరసింహం అనే వారు తాను బహిర్భూమికి వెళ్లిన సమయంలో బండ్ల లక్ష్మయ్య మనవడితో అత్యాచారం చేయించారని, వీరిని కఠినంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా తూర్పు పోలినేని పాలెం గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ కోరారు. కన్నకొడుకులే కాలాంతకులుగా మారి, తన పేరు మీదున్న పొలాన్ని ఫోర్జరీ సంతకాలతో కాజేసి, తననే కొట్టడానికి వస్తున్నారని, కనీసం అన్నం కూడా పెట్టకపోవటంతో అన్న క్యాంటీన్ తిని బతుకుతున్నానని పల్నాడు జిల్లా గుమ్మనంపాడుకు చెందిన ముక్కపాటి రాజ్యం కళ్ల నీళ్ల పర్యంతమైంది. 
 
ప్రకాశం జిల్లా గుమ్మలంపాడులో 2002లో తాను కొనుగోలు చేసిన, రెవెన్యూ రికార్డుల్లో నమోదైన భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృషించి, తన భూమిని కొట్టేసేందుకు అబ్బూరి శేషయ్య, చాలా హరికృష్ణ కుట్ర చేశారని చీమకుర్తికి చెందిన ముప్పరాజు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. మాల్యాద్రినాయుడు అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి, తమ పాసుపుస్తకాలను రద్దు చేయించాడని, ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా భీమవరప్పాడుకు చెందిన గోనుగుంట వెంకటేశ్వర్లు కోరారు. ఏలూరుకు చెందిన మైసన్నగూడెంలో తన భూమిని రీసర్వే పేరుతో గ్రామసర్పంచ్, అధికారులు మోసం చేసి, ఇతరుల పేరుపై మార్చారని ఓ వ్యక్తి వినతి పత్రాన్ని అందజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు