కాంగ్రెస్‌తో కలిసి అవిశ్వాసమా..? గల్లాగారూ మీరూ శాపగ్రస్థులైయ్యారు: రాకేష్ సింగ్

శుక్రవారం, 20 జులై 2018 (12:52 IST)
లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సాగుతోంది. ఏడు గంటల పాటు ఈ చర్చ సాగనుంది. చివరిగా ఓటింగ్ నిర్వహిస్తారు. ఏపీకి అన్యాయం చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంలో ఏకిపారేశారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి కాంగ్రెస్‌కు పట్టిన గతేపడుతుందని, ఆపార్టీ శాపానికి గురికానుందని అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. 
 
గల్లాగారూ మీరు శాపం బీజేపీకి తగులుతుందన్నారు. కానీ కాంగ్రెస్‌తో కలిసి ఎప్పుడు అవిశ్వాసం పెట్టారో.. అప్పుడే మీరూ శాపగ్రస్థులైయ్యారని రాకేష్ సింగ్ అన్నారు. ప్రజలు వెలేసేది బీజేపీని కాదు. టీడీపీనేనని తొందర్లోనే తెలుస్తుందని రాకేష్ సింగ్ అనడంతో బీజేపీ సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేశారు. కానీ తెలుగుదేశం సభ్యులు సభలో నిరసన తెలిపారు. 
 
ఆపై తన ప్రసంగాన్ని కొనసాగించిన రాకేష్, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ప్రారంభించిన కుమారస్వామి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని దేశమంతా చూశారన్నారు. అద్భుతమైన పాలన కొనసాగిస్తున్న మోదీ సర్కారుపై అవిశ్వాసం పెట్టడం దారుణమని రాకేష్ సింగ్ వ్యాఖ్యానించారు. 
 
పనిలో పనిగా కాంగ్రెస్ నేతలపై రాకేష్ సింగ్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. పదేళ్లపాటు మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిని చేసి సోనియా గాంధీనే దేశాన్ని పాలించారంటూ రాకేష్ సింగ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఖర్గే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు