స్వామి అగ్నివేష్‌పై దాడి ... కిందపడేసి చితకబాదారు...

మంగళవారం, 17 జులై 2018 (16:38 IST)
ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడి జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. రాంచీకి 365 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్‌లో ఓ కార్యక్రమానికి హాజరుకావడానికి వెళ్లిన అగ్నివేష్‌.. తాను బస చేసిన హోటల్ గది నుంచి బయటకు వస్తుండగా ఈ దాడి జరిగింది. అగ్నివేష్‌ను చితకబాదారు. కిండపడేసి కొట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైశ్రీరాం అంటూ ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి కూడా. ఈ దాడి సమయంలో కొందరు గిరిజన యువకులు రక్షణగా ఉన్నప్పటికీ వారిని కూడా పక్కకు నెట్టేసి దాడికి తెగబడ్డారు.
 
ఈ దాడి ఘటన తర్వాత అగ్నివేష్ స్పందిస్తూ, ఎలాంటి హింసకైనా తాను వ్యతిరేకమని, తనపై ఎందుకు దాడిచేశారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో చుట్టుపక్కల ఒక్క పోలీసు కూడా లేరని వాపోయారు. బయట బీజేవైఎం కార్యకర్తలు తన కోసం హోటల్ బయట వేచివుండి, తాను బయటకురాగానే ఒక్కసారిగా దాడి చేశారన్నారు. 
 
ఓ సెమినార్‌లో పాల్గొనేందుకు తన గిరిజన మిత్రులతో కలసి వెళ్తుండగా, దాడి చేశారని తెలిపారు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే దాడికి దిగారని చెప్పారు. పిడికిళ్లతో గుద్దుతూ, కొడుతూ, రోడ్డుపై పడేసి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన పదజాలాన్ని తనపై ఉపయోగించారని చెప్పారు.
 
కాగా, దాడిలో గాయపడ్డ స్వామి అగ్నివేష్‌కు స్థానిక ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అగ్నివేష్‌పై జరిగిన దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని భావిస్తున్నారు. దాడికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు