ఎర్ర తివాచి వద్దు, నేను మీలో ఒకడినే: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

మంగళవారం, 7 జనవరి 2020 (15:47 IST)
ఆడంబరాలకు దూరంగా ఉండే రాష్ట్ర ప్రధమ పౌరుడు మరో అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ప్రోటోకాల్ పేరిట సాగే ఎర్ర తివాచి స్వాగతాలు ఇక వద్దంటున్నారు. రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షకుడి హోదాలో గవర్నర్‌కు అత్యున్నత స్థాయి గౌరవ మర్యాదలు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ఇకపై ఈ మర్యాదలు ఏవీ వద్దంటున్నారు. 
 
వాయు శకటం నుండి ఎర్ర తివాచీతో గవర్నర్‌ను స్వాగతించే విధానం రద్దుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని బిశ్వ భూషణ్ తన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించారు. ఇటీవల శ్రీశైలం పర్యటనకు వెళ్లినప్పుడు ఈ తరహా ఆలోచనకు అంకురార్పణ చేసిన గవర్నర్ దానిని ఆచరణలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. అనవసరపు వ్యయంతో కూడిన బ్రిటీష్ కాలం నాటి సాంప్రదాయాలను విడనాడాలని పేర్కొన్నారు. 
 
రాజ్యాంగబద్దమైన కార్యక్రమాలను మాత్రం ప్రోటోకాల్ ప్రకారం నిర్వహిస్తే సరిపోతుందని, గవర్నర్ ప్రతి పర్యటనకు ఎర్రతివాచీలు అవసరం లేదని ఆయన భావిస్తున్నారు. గవర్నర్‌గా ప్రమాణా స్వీకారం తొలిరోజునే ‘హిస్ ఎక్సలెన్సీ’ పేరిట సాగే ప్రత్యేక ప్రస్థావనను కాదనుకున్నారు, అధికారులకు అదే చెప్పారు, మీడియా ద్వారా “ఆయన శ్రేష్ఠత”  పేరిట సంబోధన వద్దని ప్రజలకు సైతం విజ్ఞప్తి చేయటం ఆయన గొప్పతనానికి నిదర్శనం.
సాధారణంగా నేతలు పొదుపుపై ప్రసంగాలు చేస్తారే తప్ప ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. కాని గవర్నర్ హరిచందన్ తనదైన శైలిలో వ్యవహరిస్తూ తనకు తానుగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. తన పర్యటనలు హంగు, ఆర్భాటాలకు దూరంగా సాగాలని తన సిబ్బందికి స్పష్టం చేసిన ప్రధమ పౌరుడు సగటు ప్రజల కోసం ఏమి చెయ్య గలమన్న దానిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు. 
 
రాజ్ భవన్ గౌరవమర్యాదలు కాపాడే క్రమంలో కొంతమేర ప్రోటోకాల్ తప్పదంటూ అధికారులు అనుక్షణం ఆయనకు నచ్చచెప్పుకోవలసి వస్తుందంటే హరిచందన్ పనితీరు మనకు ఇట్టే అర్ధం అవుతోంది. ప్రతి చిన్న విషయంలోనూ పొదుపు చర్యలను అభిలషించే హరిచందన్ తన గౌరవార్ధం వివిధ సందర్భాలలో ప్రముఖులు అందించే శాలువాలను సైతం ఎలా సద్వినియోగం చేయగలమన్న దానిపై సమాలోచిస్తున్నారు. ఇప్పటికే  తనను కలిసేందుకు వచ్చే వారి నుండి పుష్ప గుచ్ఛం స్వీకరించే విధానాలకు స్వస్తి పలికిన మాననీయ గవర్నర్, తనకోసం వచ్చే ఎవరైనా మొక్కలను మాత్రమే తీసుకురావాలని నిర్ధేశించారు.
ఇలా వస్తున్న మొక్కలను తిరిగి రాజ్ భవన్ ప్రాంగణంలో నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తున్నారు. ప్రధమ పౌరునిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి సగటు ప్రజలతో మమేకమయ్యేందుకే ఇష్టపడే హరిచందన్ తదనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. గిరిజన ప్రాంతాలపై పరిపాలకుడి హోదాలో ప్రత్యేక అధికారాలు కలిగిన గవర్నర్ వాటిని సద్వినియోగ పరచటం ద్వారా వారికేదైనా మేలు చేయగలమా అన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో విజయనగరం జిల్లా సాలూరు అదివాసిలతో భేటీ అయినా, ఇటీవల శ్రీశైలం చెంచులతో సంభాషించినా వారి కోసం ఏదో చేయాలన్న తలంపే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు