అనంత‌పురంలో 'ఒక‌రోజు క‌లెక్ట‌ర్'

ఆదివారం, 11 అక్టోబరు 2020 (18:13 IST)
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంత‌పురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒకరోజు పదవీ బాధ్యతలను అప్పగించారు.

‘బాలికే భవిష్యత్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు.

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్‌గా ఆమె ఆదివారం నాడు బాధ్యతలను నిర్వహించారు.

చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోగా.. పక్కనే చంద్రడు చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలిక శ్రావ‌ణి కొన‌సాగారు.

అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు... ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు శనివార‌మే ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే వారికి అవకాశం కల్పించాలని ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేలు పరిహారం అందించే ఫైల్‌పై శ్రావణి సంతకం చేశారు. అలాగే రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులను అధికారిక పనుల గురించి  ఫోన్‌లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ఫైల్‌పై కూడా ఒకరోజు కలెక్టర్ సంతకం చేశారు.

గంధం చంద్రుడు లాంటి నిబద్ధత కలిగిన అధికారులు బహు అరుదు. మీరు చేసిన ఈ పని చాలా బాగా నచ్చింది. బ్యూరోక్రాట్ల పట్ల ప్రజల్లో మరీ ముఖ్యంగా యువతలో ఒక అవగాహన రావాలంటే ఇలా చేయడం ఉత్తమం.

దీని ద్వారా పిల్లలు కూడా భవిష్యత్తులో అవినీతికి తావులేని అధికారులుగా మారడానికి అవకాశం ఉంటుంద‌ని ప్ర‌జ‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు