తల్లితో ఒకడు వివాహేతర సంబధం, చెల్లిని వరించిన మరో కామాంధుడు, ఇద్దరూ కలిసి...

శనివారం, 7 ఆగస్టు 2021 (13:42 IST)
తండ్రి లేడు. కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఇంటికి పెద్ద దిక్కు పోయింది. దీనితో టీనేజ్ వయసులోనే తన తల్లికి, చెల్లికి అన్నీ తానై కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు ఆ 17 ఏళ్ల యువకుడు. ఐతే తల్లి వివాహేతర సంబంధం, చెల్లిపై మరో కామాంధుడు ప్రేమ రెండూ కలిసి అతడిని బలి తీసుకున్నాయి.
 
వివరాలు ఇలా వున్నాయి. విజయనగరం రూరల్ ప్రాంతమైన సారిక గ్రామానికి చెందిన 17 ఏళ్ల పవన్ కుమార్ గత మే నెల 9 నుంచి అదృశ్యమయ్యాడు. అతడి తల్లి తన కుమారుడు కనిపించడంలేదంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఎక్కడా క్లూ దొరకలేదు.
 
ఐతే సారిక గ్రామానికి కాస్తంత దూరంలో వున్న పాడుబడిన వ్యవసాయ బావిలో ఓ శవాన్ని గమనించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు వెలికి తీసి పరిశీలించి అది పవన్ కుమార్‌దేనని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసారు. దాంతో వాస్తవాలు వెలికి వచ్చాయి.
 
పవన్ తండ్రి చనిపోవడంతో అతడి తల్లి జగదీశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన పవన్ తల్లిని మందలించాడు. ఇంట్లో ఆడపిల్ల వుందని, జాగ్రత్తగా వుండాలని హితవు చెప్పాడు. ఇదిలావుంటే ఇతడికి 33 ఏళ్ల సురేష్ అనే వ్యక్తితో మంచి స్నేహం వుంది. అతడు వారి ఇంటికి వచ్చీపోతూ పవన్ చెల్లిపై కన్నేశాడు. ఆమెను తను వివాహం చేసుకుంటానని ప్రతిపాదించాడు. దానితో పవన్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.
 
15 ఏళ్లు కూడా నిండని, పాఠశాలకు వెళ్లే బాలికను నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటూ మందలించాడు. దానితో సురేష్ సైలెంట్ అయ్యాడు కానీ పగ పెంచుకున్నాడు. ఆ బాలికను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్న సురేష్ కుట్ర పన్నాడు. పవన్ తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న జగదీష్ ను సంప్రదించాడు.
 
ఇద్దరూ కలిసి మరికొందరితో పవన్ హత్యకు ప్రణాళిక వేసారు. ఇంతలో తనకు డబ్బు అవసరం వుందని, సర్దుబాటు చేయమంటూ సురేష్ ని అడిగాడు పవన్. ఇదే అదనుగా భావించిన సురేష్, జగదీష్ కు ఫోన్ చేసి సిద్ధంగా వుండమన్నాడు. డబ్బు ఇస్తా రమ్మని చెప్పి రాత్రివేళ అంతా కలిసి మూకుమ్మడి దాడి చేసి అతడిని హత్య చేసారు. ఆ తర్వాత అతడితో పాటు అతడి బైకుని పాడుబడిన వ్యవసాయ బావిలో పడవేసి పరారయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు