షికాగోలో మూర్ఛ వ్యాధితో తెలుగు విద్యార్థి మృతి

సోమవారం, 11 ఏప్రియల్ 2022 (08:21 IST)
షికాగోలో విషాదం జరిగింది. మూర్ఛవ్యాధి వచ్చి ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన దొండపాడు కార్తీక్ (26)గా గుర్తించారు. 
 
షికాగోలోని లవిస్ యూనివర్శిటీలో ఎంఎస్ డేటా సైన్స్ విద్యను అభ్యసించేందుకు రెండు నెలల క్రితం కార్తీక్ అక్కడకు వెళ్లాడు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఆదివారం ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీంతో సమీపంలోని ఆస్పత్రికి తరలిన కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారాన్ని తల్లి శోభారాణికి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
అయితే కడసారి చూపు కోసం తన బిడ్డ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. అలాగే, తానా ప్రతినిధులకు కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా, 17 యేళ్ల క్రితం కార్తీక్ అన్న కూడా శ్రీరామ నవమి పండుగ రోజే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇపుడు కార్తీక్ కూడా నవమి పండుగ రోజే చనిపోవడం గమనార్హం. 
 
వీరి తండ్రి ఏడేళ్ల క్రితం చనిపోయాడు. మిగిలిన ఒక్కగానొక్క కొడుకు కార్తీక్‌ను తల్లి శోభారాణి చదివిస్తోంది. రెండేళ్లలో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన కొడుకు అర్థాంతరగా తనువు చాలించాడన్న సమాచారంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. శోభారాణినిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పరామర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు