ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు... క్లాస్ కు 20 మంది మాత్ర‌మే!

మంగళవారం, 24 ఆగస్టు 2021 (14:15 IST)
రాష్ట్రంలోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. క‌రోనా గైడ్ లైన్స్ ని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.

హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 వరకు విద్యార్థులకు సెల్ఫ్ లెర్నింగ్, సూపర్ అడ్వైజరీ స్టడీ క్లాస్, సాయంత్రం 4 నుంచి 5 వరకు గేమ్స్, స్పోర్ట్స్ సెక్షన్లు ఉంటాయన్నారు. వీటికి ఆయా స్కూళ్ల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లు, ఎస్‌ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరు కావాల్సి ఉంటుంది.

ఇలాగే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు హాజరు మినహాయింపు కల్పించారు. కానీ విద్యార్థులు మాత్రం అన్ని క్లాసులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్ మాత్రమే.
 
కరోనా ప్రభావం తీవ్రంగా పడిన రంగాల్లో విద్యారంగం ఒకటి. ఏడాదిన్నరకు పైగా స్కూళ్లు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నా, అవి విద్యార్థులకు ఎంతమేర అర్థం అవుతున్నాయన్నది అంతు చిక్కని ప్రశ్నే. ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తగ్గడంతో స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని సీఎం జగన్ సర్కార్ సైతం ఆగస్టు 16 నుంచి స్కూళ్లను తెరిచింది.
 
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులను 20 మంది చొప్పున ఓ బ్యాచ్ గా ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహించాలని తెలిపింది. భౌతిక దూరం పాటిస్తూ, సరిపోను స్థలం ఉంటే అన్ని క్లాసులను ఒకేసారి నిర్వహించవచ్చని ప్రభుత్వం తెలిపింది. గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు నిర్వహించాలని స్పష్టం చేసింది. 
 
విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి తప్పనిసరిగా నిత్యం థర్మల్ స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు ఉన్న వారిని టెస్టులకు పంపించాలి. పిల్లలను స్వచ్ఛందంగా స్కూల్ కు పంపింస్తున్నట్లు పేరెంట్స్ నుంచి అనుతమతి లేఖలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ వారం ఒక స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి ర్యాండమ్ గా కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే, ఆ పాఠశాలలోని అందరికీ పరీక్షలు నిర్వహించాలి.

మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు ఎదురెదురు కూర్చోకుండా చూడాలి. స్కూల్ వదిలిన సమయంలో విద్యార్థులు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి. స్కూల్ బస్సుల్లోనూ సగం మందినే అనుమతించాలి. ఆటోలు, రిక్షాల్లో విద్యార్థులు రావొద్దు. బస్సులు, వ్యాన్ల సదుపాయం లేకపోతే పేరెంట్స్ తీసుకొచ్చి, తీసుకెళ్లాలని మార్గదర్శ కాలలో స్పష్టం చేశారు.
 
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న పెద్దలతో పిల్లలను స్కూళ్లకు అనుమతించవద్దని సర్కార్ స్పష్టం చేసింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు విద్యార్థులను స్కూల్ కు తీసుకురావడం, మళ్లీ తీసుకు పోవడానికి కూడా అనుమతించకూడదు. ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించడం, ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి అని మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు