వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకుంటేనే... కౌంటింగ్ సెంట‌రుకు

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:11 IST)
జడ్పి టిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపుపై కోవిడ్ మార్గదర్శకాలను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈనెల 19న నిర్వహించనున్న జడ్పి టిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపుపై శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ జిల్లా కలెక్టర్లు,ఎస్పిలు,డిపిఓలు,  జడ్పి సిఇఓలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
 
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ, ఈనెల 19న నిర్వహించే జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలు మార్గదర్శకాలను ఇచ్చారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లు ఎస్పి లను ఆయన ఆదేశించారు. ఆలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు ఎస్పిలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ కలెక్టర్లు కు స్పష్టం చేశారు.
 
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పి లను సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను, ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్చార్జి గా పెట్టాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ కలెక్టర్లును ఆదేశించారు.
 
ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు