గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్, పాన్‌ కార్డ్‌ సేవలు

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (09:38 IST)
Village
ఆధార్, పాన్‌ కార్డ్‌ లాంటి సేవలు కూడా ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి తేవాలని ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయాలపై అధికారులతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. 
 
సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు సీఎం జగన్‌ మానసపుత్రికలన్న మంత్రులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
 
సీఎం జగన్‌ ఆలోచనల నుంచి పుట్టిన ఈ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నామన్నారు. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శిస్తారన్నారు. 
 
ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలను సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి అందిస్తారని చెప్పారు. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే.. అర్హులను గుర్తిస్తారని వివరించారు.
 
గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి, తిరస్కరించినవి వేర్వేరుగా చూపాలని అధికారులకు సూచించామన్నారు. సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సీఎం జగన్‌ ఇప్పటికే కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లను ఆదేశించారని గుర్తు చేశారు. 
 
ఇకపై నెలకు రెండుసార్లు మంత్రులం కూడా సందర్శిస్తామని చెప్పారు. సీఎం జగన్‌ గ్రామ స్థాయి పర్యటనలు ప్రారంభించేలోపు సచివాలయాలన్నింటినీ పూర్తిగా సిద్ధం చేస్తామన్నారు. వాటి పనితీరును మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు