జ‌న‌సేన రోడ్ల శ్ర‌మ‌దానానికి జాతీయ స్థాయిలో స్పంద‌న‌

సోమవారం, 25 అక్టోబరు 2021 (11:02 IST)
జనసేన పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజానీకం కష్టాలను, వారి నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా ఉండాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లి, కనీసం మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అప్పుడే శ్రమదానం ద్వారా మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారాన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చింది అని, శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
పార్టీ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా, మండల స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఆ పరిధిలో దెబ్బ తిని ఉన్న ఒక రోడ్డుకు మరమ్మతు చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  మాట్లాడుతూ “సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది మన పార్టీ లక్ష్యం. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదన్నారు. ఏ అంశాన్నైనా ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం. ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు. అనంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి అని సూచించారు. త్వరలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు నియామక ప్రక్రియ మొదలవుతుంద‌ని వెల్లడించారు.  రాష్ట్ర వ్యాప్తంగా  జిల్లాల వారీగా పార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు