అతి త్వరలో పవన్- జగన్ భేటీ.. కుదిరితే లోటస్‌పాండ్‌లో ఫిబ్రవరి 8నే చర్చలు... నిజమేనా?

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (04:08 IST)
జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్, వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారా? జనసేన పార్టీ విశ్వసనయ వర్గాల నుంచి వస్తున్న వార్తలు నిజమే అయితే.. ఫిబ్రవరి 8నే హైదరాబాద్ లోని జగన్ నివాసం లోటస్‌పాండ్‌లో ఇరువురూ కలిసి చర్చించనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంపై, ఇతర ప్రజాసమస్యలపై పోరాడే విషయంలో జగన్‌తో  చేతులు కలపడానికయినా తాను సిద్ధమే అని గత నెల చివరలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. సెలబ్రిటీలను కలవడానికి పెద్దగా ఆసక్తి చూపని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పవన్‌తో చర్చించేదుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియడం ఆశ్చర్యం గొలుపుతోంది.
 
ప్రత్యేక హోదాపై గత రెండున్నరేళ్లకు పైగా పోరాడుతున్నాప్పటికీ పరస్పరం పరామర్శలు కూడా లేని పవన్, జగన్ ఇప్పుడు ఒక్కసారిగా భేటీ కావడానికి కూడా సిద్ధమవుతున్నారంటే వారిని కలిపింది ఎవరు అన్న కుతూహలం కలుగుతుంది.  ఈ ఇద్దరితోనూ సన్నిహిత సంబంధాలు కలిగిన సీనియర్ డాక్టర్ ఒకరు పరస్పర చర్చలు జరపాలంటూ ఇద్దరికీ మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తోంది. 
 
పైగా ఊరకే ట్విట్టర్ వార్‌లో తన్ను తాను బంధించుకోవడం కంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాసమస్యలపై నేరుగా జనంలోకి రావడమే మంచిదనే నిర్ణయానికి పవన్ వచ్చేశాడని సమాచారం. మరోవైపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకపక్ష వ్యూహాలు పన్నడానికి బదులు భావసారూప్యత కలిగిన వీలైనంత మందిని కలుపుకుపోవాలనే ప్రతిపాదనపై జగన్ కూడా అంగీకారానికి వచ్చేశారని కూడా తెలుస్తోంది.
 
ఒకవేళ ఈ ఇద్దరు ప్రజాకర్షక నేతలూ కలిసి ప్రజాసమస్యలపై పరస్పరం భావాలు పంచుకున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి ప్రణాలికతో పనిచేయడానికి ఇద్దరూ ఒడంబడిక చేసుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. అదే జరిగితే ఏపీ రాజకీయాలు మూలమలుపు తీసుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు.
 

వెబ్దునియా పై చదవండి