పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటనకు షెడ్యూల్ ఖరారు

వరుణ్

సోమవారం, 22 జనవరి 2024 (08:59 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన తన పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ టూర్‌లో ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్‌షో స్థానిక నేతలతో ఇంటర్వ్యూలు ఉంటాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. 
 
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ జోనల్‌ కమిటీల సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇందులో మనోహర్‌ మాట్లాడుతూ.. 'పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగసభలు ఏర్పాటుచేసేలా ప్రణాళిక రూపొందించాం. రోజుకు మూడు సభల్లో పవన్‌ పాల్గొంటారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను జోనల్‌ కమిటీలు తీసుకోవాలి' అని సూచించారు. 
 
మరో రెండు నెలలు శక్తివంచన లేకుండా కష్టపడితే విజయం తథ్యమని కమిటీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి 191 మందితో కమిటీలు వేశామని, మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్‌ కల్యాణ్‌ పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు నాదెండ్ల తెలిపారు. సమావేశంలో పార్టీ లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ ఇవన సాంబశివ ప్రతాప్‌, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం ఛైర్మన్‌ కళ్యాణం శివశ్రీనివాస్‌, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌, డాక్టర్స్‌ సెల్‌ ఛైర్మన్‌ బొడ్డేపల్లి రఘు పి.గౌతమ్‌రాజ్‌, బోడపాటి శివదత్‌ తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు