వైకాపా నేతలు భూదోపిడీపై ప్రజా కోర్టులు : పవన్ కళ్యాణ్

బుధవారం, 16 ఆగస్టు 2023 (16:43 IST)
ఏపీలోని వైకాపా నేతల భూదోపిడీపై ప్రజాకోర్టులు ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఆయన మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ వీరమహిళలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నారు. 'ప్రజాస్వామ్య దేశంలో బలమైన చట్టాలు, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ నేటి పరిస్థితుల్లో ప్రతి చిన్న అంశానికి సామాన్యుడు కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితి ఉంది. వైసీపీ నాయకుల అక్రమాలు, దోపిడీలపై జనసేన ప్రజాకోర్టు నిర్వహిస్తుంది. 
 
క్షేత్రస్థాయిలో తప్పులకు న్యాయస్థానాలైతే ఎలాంటి శిక్షలు వేస్తాయి..? వైసీపీ నేతల తప్పులకు న్యాయపరంగా ఎలా స్పందించాలి అనే విషయాలను ప్రజాకోర్టులో ఉంచుతాం. వారు చేస్తున్న తప్పులు రాజ్యాంగానికి ఎంత విరుద్ధమైనవో తెలియజేస్తాం. రాజ్యాంగం చెప్పిన ఏ అంశాన్నీ జగన్ పట్టించుకోవడం లేదు. ఆర్థిక అవకతవకలు చేసి 38 కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణ చేసే న్యాయస్థానాలపై నిందలు వేసే స్థాయికి వెళ్లారు. 
 
పర్యావరణాన్ని కాపాడాల్సిన పెద్ద మనిషి విధ్వంసం చేస్తున్నాడు. మోసపూరితమైన మాటలు నమ్మి ఒక వ్యక్తికి ఓటు వేస్తే, ఐదేళ్లు విలువైన కాలం ఏమైపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మన కోసం నిలబడతాడా లేదా అని ఆలో చించిన తర్వాతే మీ మద్దతు ఇవ్వాలి అని జనసేనాని సూచించారు. 
 
అలాగే, వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో.. సంక్షేమం నిలిచిపోతుందేమో.. అనుకోవద్దు. ఇంతకంటే అద్భుత మైన సంక్షేమ పథకాలుంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలిస్తే ఇక్కడ ఉండలేం.. పారిపోతామని నాకు చెప్పుకొని బాధపడేవారే ఎక్కువగా కనిపి స్తున్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు.. ఇలా భిన్నవర్గాల వారు జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, బతకడానికి భయపడే పరిస్థితులు వస్తాయని మధనపడుతున్నారు. 
 
అందరికీ నేను చెప్పేదొక్కటే. ఎక్కడికెళ్లినా జగన్ వంటి వ్యక్తులు, అతడి కంటే క్రూరమైన వారు కనిపిస్తూనే ఉంటారు. ఈ నేలను విడిచి పారిపోవాల్సిన అవసరం లేదు. సమష్టిగా పోరాడి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో జగన్ వంటి వ్యక్తులను తరిమికొడదాం. సీఎం జగన్ నివాసముండే తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోనే నేరాల రేటు ఎక్కువగా ఉంది. మహిళలకు న్యాయం చేయలేని, వారిని గౌరవించలేని మనసుతో మీరు ఎన్ని చట్టాలు చేసినా వృథానే. శాంతిభద్రతల రక్షణకు జనసేన తొలి ప్రాధాన్యం ఇస్తుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థలు పనిచేసేలా చేస్తామని ఆయన ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు