బాబు-జగన్‌ల కంటే ముందుకు దూకుతున్న పవన్ కల్యాణ్.. ముహూర్తం ఫిక్స్

గురువారం, 24 జనవరి 2019 (18:09 IST)
ఏపిలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. అధికార పార్టీ ఇప్ప‌టికే అభ్య‌ర్దుల ఖ‌రారు ప్ర‌క్రియ ప్రారంభించింది. ప్ర‌తి ప‌క్ష వైసీపీ అధినేత త‌న పాద‌యాత్ర‌లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసారు. ఇక‌, కొత్త‌గా ఎన్నిక‌ల బ‌రిలో కి దిగుతున్న జ‌న‌సేన సైతం ఇప్ప‌టికే తొలి జాబితాను సిద్దం చేసింది. ఈ జాబితా ప్ర‌క‌ట‌న‌కు ముహూర్తం సైతం ఖ‌రారు చేసింది. దీంతో.. జ‌న‌సేన నుండి పోటీ చేయాల‌నుకుంటున్న ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
 
2019 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈనెల 26వ తేదీన ప్రకటించాల‌ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భావిస్తున్నారు. దీంతో.. తొలి జాబితాలో తూర్పు గోదావ‌రితో పాటుగా గుంటూరు.. శ్రీకాకుళం- అనంత‌పురం జిల్లాల‌కు చెందిన కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు ఉండే అవ‌కాశం ఉంది. జ‌న‌సేన తొలి అభ్య‌ర్ధిగా ఇప్ప‌టికే తూర్పు గోదావ‌రి జిల్లాలోని ముమ్మిడివరం నుంచి బీసీ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ పేరును ప్రకటించే అవకాశముంది.
 
రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి కందుల దుర్గేష్‌, తుని నుంచి రాజా అశోక్‌బాబు, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాకినాడ రూరల్‌ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయి, పి.గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్‌ పేర్లలో కొన్నింటిని ప్రకటించే అవకాశముంది. వీలైతే మరి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్ధుల పేర్లు ప్రకటించే అవకాశం క‌నిపిస్తోంది. ఇక‌, గుంటూరు జిల్లాలో తోట చంద్ర‌శేఖ‌ర్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ వంటి వారు పేర్లు తొలి లిస్టులో ఉండే ఛాన్స్ ఉంది. అనంత‌పురం నుండి ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ప్ర‌జాసేవ‌లో ఉన్న ఇద్ద‌రి పేర్ల పైన ప‌వ‌న్ దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. వీరి పేర్లు తొలి జాబితాలో ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది.
 
ప్ర‌ధానంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధులు తొలి జాబితాలో ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌జారాజ్యంలో ఎన్నిక‌ల ముందు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌కపోవడం ద్వారా.. వారు పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈసారి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. పొత్తు కోసం త‌నపై ఒత్తిడి వ‌స్తున్న ప‌రిస్థితుల్లో అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న మొద‌లుపెడితే తాను ఎవ‌రితో లేననే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని జ‌న‌సేనాని భావిస్తున్నారు. దీంతో.. మిగిలిన రెండు ప్ర‌ధాన పార్టీల కంటే ముందుగానే తమ తొలి జాబితా విడుద‌ల చేసేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సిద్దం అవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు