టీడీపీ - జనసేనలు కలిసి పోటీ చేయొచ్చు : టీజీ వెంకటేష్

బుధవారం, 23 జనవరి 2019 (16:24 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన పార్టీలు మళ్లీ కలిసి పోటీ చేయొచ్చంటూ టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమాజ్‌వాదీ - బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయని అందువల్ల ఏపీలో కూడా టీడీపీ - జనసేనలు కలిసి పోటీ చేయడంలో తప్పులేదన్నారు. 
 
పైగా, ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో ఎలాంటి వైరం లేదన్నారు. కానీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీసే విషయంలోనే టీడీపీ - జనసేనల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని చెప్పారు. 
 
ఇకపోతే, కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపులో ఎలాంటి గందరగోళం లేదనీ, కానీ ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం ఈ టిక్కెట్‌ను తనకే కేటాయిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కారణంగానే కొంత గందరగోళం నెలకొందన్నారు. వాస్తవానికి సర్వే ఫలితాల మేరకు ఈ సీటును పార్టీ అధినేత కేటాయిస్తారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు