విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర రూ.30

ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (14:17 IST)
ప్రయాణికులకు దక్షిణ రైల్వే తేరుకోలేని షాకిచ్చింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వేప్లాట్‌ ఫామ్‌ టిక్కెట్‌ ధరను అమాంతం పెంచేసింది. ఈ పెంచిన ధరను చూసి రైల్వే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
ముఖ్యంగా, దక్షిణమధ్య రైల్వేలో ప్రధాన నగరాలైన విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరాల్లో ఆదివారం నుంచి అక్టోబరు 10వ తేదీ వరకూ ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధర పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఫలితంగా ఇప్పటివరకూ 10 రూపాయలు ఉన్న ఈ ధర ఆదివారం నుంచి రెండితలు పెరిగి అంటే రూ.30 అయింది. దీంతో ప్రస్తుత రేటుకు రూ.20 అదనంగా భారం పడనుంది.
 
సాధారణంగా రైల్వే ఆవరణలోకి వెళ్లేవారు రూ.10 ధరతో కూడిన ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ కొనుగోలు చేయాల్సివుంటుంది. ఇపుడు పండుగ  సీజన్‌లో రద్దీని నివారించేందుకు వీలుగా ఈ టిక్కెట్ ధరను రూ.30కు పెంచారు. కానీ, అదే ప్లాట్‌పామ్‌‌పైకి వెళ్లాల్సిన వ్యక్తి పక్కనే ఉన్న ద్వారపూడి రైల్వేస్టేషన్‌, కొవ్వూరు రైల్వేస్టేషన్‌‌లో ప్రయాణించేందుకు ప్యాసింజరు టిక్కెట్‌ కొనుగోలు చేస్తే దాని ధర రూ.10లే. ఈ టిక్కెట్‌తో రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పైకి రావొచ్చు. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణకులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
వాస్తవానికి ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌కు రెండు గంటలు చెల్లుబాటు పరిమితిని విధించారు. రూ.10లతో ప్యాసింజరు టిక్కెట్‌ కొనుగోలు చేసి ప్లాట్‌ఫామ్‌పైకి వెళితే 3 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇదేం చిత్రమో తెలియదు గానీ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికి రూ.30లు పెట్టి టికెట్‌ కొనుగోలు చేస్తే కేవలం 2 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుందట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు