సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్టు

గురువారం, 4 జూన్ 2020 (08:03 IST)
నకిలీ రికార్డులు సృష్టించారన్న ఆరోపణలపై సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.మాధురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు విజయవాడలోని ఆమె ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
 
ఆ తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి వీవీఎస్ఎన్ లక్ష్మి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. తెలుగుదేశం పార్టీలో రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడైన రావెల గోపాలకృష్ణ 3.11 ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చినట్టు చూపించారు.
 
ఇందుకు ప్రతిగా 3,100 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్‌డీఏ ద్వారా కేటాయించారు. అలాగే, రూ.5.26 లక్షల కౌలు చెల్లించారు. 
 
నిజానికి రికార్డులలో వీరు చూపిన ఆ భూమి నాగార్జున సాగర్ రెండు రోడ్లకు చెందినది. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ మాధురి తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణలో భాగంగా ఆమెను అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు