రైతుల ముసుగులో రాజకీయ పార్టీలు: మంత్రి వెలంపల్లి

గురువారం, 2 జనవరి 2020 (19:25 IST)
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, మతానికి కులానికి వర్గానికి రాజకీయానికి భయపడి పనిచేసే తత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి కాదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 
 
గురువారం వివిధ శాఖల అధికారులతో మరియు పార్టీ శ్రేణులతో కలిసి  మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత పశ్చిమ నియోజకవర్గం 38 వ డివిజన్ లో పర్యటించిన మంత్రి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
రైతుల ముసుగులో రాజకీయాలు చేయాలని రాజకీయ పార్టీలు చేస్తున్న క్రీడను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని రైతులకు అండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంటుందని మంత్రి  శ్రీనివాస్ పేర్కొన్నారు. 
 
గతంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసి, పరిపాలన సాగించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారు. లక్ష కోట్ల రూపాయలతో రాజధానికి అంచనా వేయడం చంద్రబాబునాయుడు చేసే రాజకీయ డ్రామాలే అన్నారు. 
 
రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు ఇక్కడ అమరావతిలో ఒక మాట, అక్కడ విశాఖలో ఒక మాట మాట్లాడటం సరికాదన్నారు.
 
బాబును ప్రజలు తిరస్కరించారని, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ప్రజలు ఓడించారని, బాబు పవన్ లకు  మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మంచి మనసుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసి విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవడం జరిగిందన్నారు. 
 
ఐదు సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులు చంద్రబాబును పదేపదే కోరినా ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇవ్వలేదన్నారు. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం లో ఆర్టీసీ కార్మికుల దీక్షలకు మద్దతు తెలిపారు. రాష్ట్రములో ఆర్టీసీ కార్మికులకు మంచి చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు అభినందించ లేదు వారికే తెలియాలి అన్నారు. 
 
రాజధానిలో సినిమా స్టంట్లు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఉద్దేశపూర్వకంగానే ఆయన రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. సినిమాల్లో గబ్బర్ సింగ్ లా పవన్ కళ్యాణ్  ఉండొచ్చు.

కానీ ఇక్కడ గబ్బర్ సింగ్ కాదని రబ్బర్ సింగ్ అని అని ఎద్దేవా చేశారు. నీతి నిజాయితీ కలిగిన అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు