మధ్యాహ్న భోజన పథకంలో పోర్టిఫైడ్ ఆహారపదార్ధాలనే వాడాలి

శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (08:15 IST)
వంట నూనెలు, పాలు, బియ్యం, గోధుమపిండి తదితర ఆహార పదార్థాలను విటమిన్ ఎ,డి,ఇ మరియు ఇతర విటమిన్లతో అనుసంధానంతో ఉన్న ఆహార పదార్ధాలనే ప్రజలు వినియోగించేలా పెద్దఎత్తున అహగాహన కలిగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

ఈ మేరకు అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేప్టీనెట్ కార్యక్రమంలో భాగంగా అడాప్సన్ ఆఫ్ పుడ్ ఫోర్టిఫికేషన్ అంశంపై గెయిన్ (గ్లోబల్ అలియెన్స్ ఫర్ ఇంప్రూవడ్ నూట్రిషన్) మరియు కర్ణాటక పబ్లిక్ హెల్త్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్య పరిరక్షణ ఆవశ్యకత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నేడు ఫోర్టిఫికేషన్ తో కూడిన ఆహార పదార్ధాలనే వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా వివిధ రకాల వంటనూనెలు, పాలు, బియ్యం, గోధుమ పిండిలను విటమిన్ ఎ,డి,ఇ మరియు ఇతర విటమిన్ల అనుసంధానం తో కూడిన ఆహార పదార్ధాలను ఆయా ఉత్పత్తి సంస్థలు తయారు చేసి మార్కెట్లో విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, అంగన్ వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుచేసే పాఠశాలలు, కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలన్నింటిలో ఈ విధమైన పోర్టిఫైడ్ ఆహార పదార్ధాలనే కొనుగోలు చేసి వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.
 
అదేవిధంగా వంటనూనెలు, పాలు, బియ్యం, గోధుమ పిండిలను విటమిన్ ఎ,డి,ఇ మరియు ఇతర విటమిన్ల అనుసంధానంతో కూడిన పోర్టిఫైడ్ చేసిన ఆహార పదార్ధాలను అమ్మవలసిందిగా ఉత్పత్తిదారులు, అమ్మకం దారులకు తెలియజేస్తూ వాటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని సీఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.

వచ్చే జనవరి 1వతేదీ నుండి పెద్దఎత్తున ఫోర్టిఫైడ్ పుడ్ వాడకాన్ని అమలుచేసేలా కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. అన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్లకు ఈ విషయమై వెంటనే తగు ఆదేశాలు జారీ చేసి జిల్లాల్లో పూర్తిగా అవగాహన కార్యక్రమాలు జరిగేలా చూడాలని సీఎస్ ఆదేశించారు.

ముందుగా ఉత్పత్తిదారులు, సరఫరాదారులకు అవగాహన కలిగించి ఆతదుపరి తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే విజయా డైరీ ద్వారా సరఫరా చేస్తున్న పాలు పోర్టిఫైడ్ చేసిలోగో గుర్తుతో విక్రయిస్తున్నందున దానిపై ఆసంస్థ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా ప్రజలందరికీ విస్తృత అవగాహన కలిగేలా ప్రచారం చేసేలా చూడాలని చెప్పారు.

ఐపియం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)ల్యాబ్ ను రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.
 
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ పోర్టిఫికేషన్ ఆహార పదార్ధాల సరఫరా వినియోగం ఆవశ్యకతపై అటు విక్రయదారులు ఇటు వినియోగదారులకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం 5 వస్తువులకు సంబంధించి పోర్టిఫికేషన్ ప్రక్రియ జరుగుతోందని ఇప్పటికే బియ్యం పోర్టిఫికేషన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభం అయిందని చెప్పారు. కర్ణాటక పబ్లిక్ హెస్తు ట్రస్టు గెయిన్ టీం లీడర్ గురురాజు పాటిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రోగ నిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు ప్రతి మనిషికి నిత్యం విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన ఆహారం అవసరమని పేర్కొన్నారు.

కానీ భారతదేశంలోని ఎక్కువ మంది విటమిన్ ఎ మరియు డి లోపం కారణంగా రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. చాలా మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని, దేశ జనాభాలో 26 శాతం మంది జనాభా ఆహార లోపంతో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా మనదేశంలో 35 శాతం మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పారు.
 
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమం,మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు ఆర్పీ సిసోడియా, కె.దమయంతి, కార్యదర్శి కాంతిలాల్ దండే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమీషనర్ కృతికా శుక్లా, పుడ్ ప్రాసెసింగ్ సంస్థ సిఇఓ శ్రీధర్ రెడ్డి, గెయిన్ ప్రాజెక్టు అధికారి అర్జిత్ చక్రవర్తి, అశోక్ ఆనంద్, ఐపియం డైరెక్టర్ మంజరి,హనుమంతరావు, కెఎన్.  స్వరూప, వి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు