అసలే కరువుకాలం.. కొత్త నిక్కర్లు కుట్టించాలంటే మీటర్లు మీటర్లు కావాలి..

గురువారం, 18 జులై 2019 (17:07 IST)
విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైకాపా వర్సెస్ టీడీపీ, టీడీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయి ఆసక్తిని రేపుతున్నాయి. ఇందుకు సోషల్ మీడియా ట్విట్టర్ వేదిక అయింది. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు మధ్య రాజుకున్న ఈ చిచ్చు ఇపుడు వైకాపా నేత, పీవీపీ సంస్థల యజమాని పొట్లూరి వరప్రసాద్‌కు పాకింది. దీంతో విజయవాడ రాజకీయాలు మరింత రంజుగా మారాయి. ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ప్రతి ఒక్కర్నీ ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నాయి. 
 
తాను ఎవరికైనా బాకీ ఉంటే వడ్డీతో సహా చెల్లిస్తాననీ, అయితే అంతకుముందు బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల మేరకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి అప్పులు చెల్లించాలంటూ పీవీపీని ఉద్దేశించి కేశినేని నాని ఇటీవల ట్వీట్ చేశారు. దీనికి పీవీపీ కౌంటరిచ్చారు. "తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు. వేల కోట్లతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలు సృష్టించాము. వేల కోట్లు బ్యాంకులకు ఎగొట్టడమెలాగో మీ "గురువు"గారిని  అడిగి చెపితే మేము ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటాము" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
అంతేకాకుండా, "ముందు నీది పసుపు నిక్కరో, ఖాకి నిక్కరో తేల్చుకోవయ్యా సామి. సక్రమ సంబంధమో లేక అక్రమ సంబంధమో ప్రజలే తేలుస్తారు. అటు ఇటు కానోళ్ళని మన బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారు. ఆటోనగర్ వెళ్లి అడిగితే చాలా క్లియర్ గా చెపుతారు" అంటూ మండిపడ్డారు. ఆపై "బై ది వే, ప్రతి సారి కొత్త నిక్కర్ కుట్టించాలన్నా,‌ మీటర్లు మీటర్లు గుడ్డ అవసరమాయే! అసలే కరువు కాలం" అంటూ మరో ట్వీట్ పెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు