7న చిత్తూరుకు రాష్ట్రపతి రాక‌

బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:46 IST)
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈనెల 7వతేదీన చిత్తూరు జిల్లా మదనపల్లె, సాడమ్ ప‌ర్యటనలకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అమరావతి సచివాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యనటకు సంబంధించి ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేనివిధంగా వివిధ శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు.

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ 7వతేది మధ్యాహ్నం చిత్తూర్ జిల్లా మదనపల్లెకు చేరుకుని సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ యోగశాల,భారత్ యోగ విద్యాకేంద్రాన్నిప్రారంభించనున్నారని సిఎస్ తెలిపారు. అలాగే 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్రపతి శంఖుస్థాపన చేయనున్నారని తదుపరి సాడమ్ చేరుకుని అక్కడ పీపాల్ గ్రోవ్ పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో ముచ్చటించ నున్నారని  పేర్కొన్నారు.

రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్,రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లు పాల్గొనేందుకు సంబంధించి కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదిత్యానాధ్ అధికారులను ఆదేశించారు.

వీడియో సమావేశంలో పాల్గొన్న ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్‌ప్రకాష్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కార్యక్రమ వివరాలను సిఎస్‌కు వివరించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పాల్గొన్న డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేపట్టనున్నబందోబస్తు ఏర్పాట్లుపై వివరించారు.

విజయవాడ నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న సమాచారశాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యంగా ఎఐఆర్, దూరదర్శన్‌లతో పాటు నాలుగు వీడియో టీంలను కవరేజి నిమిత్తం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లా కలక్టర్, ఎస్పీలు సహా సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖల పరంగా చ‌ర్య‌లు చేపట్టనున్న ఏర్పాట్లను సిఎస్‌కు వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు