సీఎం జగన్ అడ్డాలో ఇసుక మాఫియా ఆరాచకం.. మహిళా ఎస్‌పై రాళ్ళతో దాడి

ఆదివారం, 10 డిశెంబరు 2023 (10:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఇసుక మాఫియా పెట్రేగిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా ఎస్ఐపై ఇసుక మాఫియాకు చెందిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని రామేశ్వరం బైపాస్ రోడ్డులోని రెండు కుళాయిల సమీపంలో ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందడంతో ఎస్ఐ హైమావతి కానిస్టేబుల్‌తో కలిసి బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆపకుండా వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత వెనక్కి వచ్చి.. 'మమ్మల్ని ఆపుతారా..' అంటూ ఎస్ఐపై రాయి విసిరి పారిపోయారు.
 
ఈ ఘటనలో ఎస్ఐ కాలికి గాయమైంది. ఆమె సెల్‌‍ఫోన్ పగిలిపోయింది. ఈ దాడి ఘటన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు తెలియడంతో ఆయన స్పందించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రొద్దుటూరు పోలీసులను ఆదేశించారు. ఈ దాడి ఘటనపై ఎస్ఐ హైమావతి రూరల్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
కాగా ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎస్ఐపై దాడి చేసిన వ్యక్తులు ఇసుక అక్రమ రవాణాదారులే కావొచ్చునని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు