నెల్లూరు జిల్లాలో పుష్ప సీన్ రిపీట్

సోమవారం, 24 జనవరి 2022 (11:46 IST)
నెల్లూరు జిల్లాలో పుష్ప సీన్ రిపీట్ అయ్యింది. పుష్ప సినీ ఫక్కీలో  తమను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని పోలీసులు ముగ్గురు స్మగ్లర్లు సహా పదుల సంఖ్యలో కూలీలను అదుపులోకి తీసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన వల్లూరు దాము, ఆయన వద్ద గతంలో పనిచేసిన కుప్పన్న సుబ్రహ్మణ్యానికి పుదుచ్చేరికి చెందిన పెరుమాళ్లు వేలుమలైతో పరిచయం అయింది. వేలుమలై తన బావమరిది అయిన రాధాకృష్ణన్ పళనిని దాముకు పరిచయం చేశాడు.
 
వీరందరూ ఓ గ్రూపుగా ఏర్పడి ఈ నెల 20న కూలీలతో కలిసి ఎర్రచందనం చెట్లు నరికేందుకు నెల్లూరు జిల్లా గూడూరు చేరుకున్నారు. అక్కడ ఎర్రచందనం చెట్లను నరికారు. ఈ నెల 21 రాత్రి తిరుగు పయనమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. 
 
చిల్లకూరు మండలం బూదనం గ్రామం వద్ద పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ స్మగ్లర్లు.. పోలీసులపైకి గొడ్డళ్లు, రాళ్లు విసరడంతోపాటు వారిపైకి వాహనాలను ఎక్కించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాహనాలను చుట్టుముట్టి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా చేశారు. 
 
ముగ్గురు స్మగ్లర్లు, 55 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 45 ఎర్రచందనం దుంగలు, 24 గొడ్డళ్లు, 31 ఫోన్లు, 3 బరిసెలు, లారీ, టయోటా కారుతోపాటు రూ. 75 వేలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు