మా చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ : సీఎం జగన్‌కు మరో లేఖ

మంగళవారం, 29 జూన్ 2021 (13:47 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఇందులో ఆయన సెటైర్లు కూడా వేశారు. మా చెల్లి పెళ్ళి... జరగాలి మళ్ళీ మళ్ళీ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదని తన లేఖలో సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. 
 
కాగా, సీఎం జగన్‌కు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో వ‌రుస‌గా లేఖ‌లు రాస్తున్న విషయం తెల్సిందే. జ‌గ‌న్‌కు న‌వ క‌ర్త‌వ్యాల‌ను గుర్తు చేసిన ర‌ఘురామ ఇప్పుడు నవ సూచనల పేరుతో కొత్త‌గా లేఖ‌లు రాయ‌డం మొదలుపెట్టారు.
 
రాష్ట్రంలో 2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఇళ్ల నాణ్యత నాసిరకంగా ఉన్నందున ఒకసారి వాటిని నిర్మించే ప్రదేశానికి వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్‌ను కోరుతున్నానని ఆయ‌న పేర్కొన్నారు.
 
ముఖ్యంగా, రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్ర‌ణాళిక‌లు వేశార‌ని అందులో ర‌ఘురామ‌ తెలిపారు. ముందుగా రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్ర‌భుత్వం అనంత‌రం మాత్రం  దాన్ని రూ.70,000 కోట్లకు పెంచింద‌ని చెప్పారు. 
 
మరికొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నామంటూ వర్చువల్ విధానంలోనే ఇప్పటికే నాలుగు సార్లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించార‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే యమలీల చిత్రంలోని 'మా చెల్లి పెళ్లి...జరగాలి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ గుర్తుకు వస్తోందని చుర‌క‌లంటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు