'రావోను' తుఫాను చూపు దక్షిణకోస్తా వైపు... అప్రమత్తమైన ఏపీ

బుధవారం, 18 మే 2016 (13:20 IST)
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానుకు ‘రావోను’గా నామకరణం చేశారు. ఈ పేరును మాల్దీవులు దేశం సూచించింది. నేడు ఈ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
 
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారబోతోంది. అది దక్షిణ కోస్తాంధ్ర వైపు దూసుకురానుంది. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న బలమైన అల్పపీడనం నేడు తీవ్రవాయుగుడంగా మారనుంది. ప్రస్తుతం చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశగా 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ నేటి మద్యాహ్నం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ తర్వాత ఉత్తర వాయవ్య దిశగా మలుపు తిరిగి నేటి సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది.
 
దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాంధ్రలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.  ఈ ప్రభావంవల్ల రుతు పవనాలు ఈ నెలాఖరుకే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖపట్నానికి చెందిన వాతావరణ నిపుణులు తెలిపారు. కాగా, తమిళనాడులో వాయుగుండం ప్రభావం వల్ల విశాఖ, తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి