గాజువాక ప్రజలకు ఇక హ్యాపీ... ఎందుకో తెలుసా?

మంగళవారం, 30 జనవరి 2018 (20:02 IST)
గాజువాక పరిధిలోని స్థలాలను క్రయవిక్రయాలు చేసేందుకు కాలపరిమితిని 2 సంవత్సరాలకు తగ్గించాలన్న స్థానికి ప్రజల విజ్ణప్తికి మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా స్పందించింది. క్రయవిక్రయాల కాలపరిమితిని తగ్గిస్తూ ప్రభుత్వానికి  సిఫార్సు చేయాలని అధికారులను ఆదేశించింది. సచివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తిగారితో పాటు ఆర్ధికశాఖా మంత్రి యనమల రామక్రిష్ణుడు, రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయిడు, మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు మరియు విశాఖపట్నం స్ధానిక టిడిపి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 
విశాఖపట్నం జిల్లా, గాజువాక పరిధిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో. 301 ప్రకారం స్థలాల క్రమబద్దీకరణకు ధరఖాస్తు చేసుకున్న అర్జీలలో, ఇప్పటివరకు మొత్తం 7,407 ధరఖాస్తులను ఆమోదించడం జరిగింది. అయితే సదరు ఉత్తర్వులలో క్రమబద్దీకరించిన స్థలాలను క్రయవిక్రయాల జరపడానికి 5 సంవత్సరాల కాలపరిమితిని విధించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరంలేని ఆక్రమణలో గల ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం జీవో. 388 జారీ చేసింది. ఈ జీవో మేరకు క్రమబద్దీకరించిన స్థలాలను క్రయ విక్రయం చేయడానికి 2 సంవత్సరాల కాలపరిమితిని విధించారు. 
 
సదరు జీవోలో పొందుపర్చిన విధంగా గాజువాక స్థలాల విషయంలో క్రయవిక్రయాలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న 5 సంవత్సరాల కాలపరిమితిని 2 సంవత్సరాలకు తగ్గించాలన్న స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సామాన్య ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాన్ని చర్చించి, జీవో 301కి సవరణ చేయడానికి  ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతేకాక క్రమబద్దీకరణ చేయబడిన స్థలాలను తనఖా పెట్టుకొనుటకు అనుమతించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
 
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న 388జీ.వోకు కూడా క్రమబద్దీకరణ చేయబడిన స్థలాలను తనఖా పెట్టుకొనుటకు అనుమతించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ఆక్రమణలో గల ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం జీవో. 388 మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు. ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి అనే విషయం పైన సమగ్ర సమాచారం అందించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు