చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు ఆధారం ఉందా? నీళ్లు నమిలిన వైకాపా ఎమ్మెల్యే

బుధవారం, 13 సెప్టెంబరు 2023 (10:36 IST)
ఏపీ రాష్ట్ర నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటులో అవినీతి చోటుచేసుకున్నట్టు ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీమెన్స్ సంస్థ లంచం ఇచ్చినట్లు మీ దగ్గర ఆధారాలున్నాయా? అని రిపబ్లికన్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి వేసిన ప్రశ్నకు... వైకాపా నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తదితరులు పాల్గొన్న ఆ చర్చా కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యేను.... 'రాష్ట్ర ప్రభుత్వం రూ.371 కోట్లు ఖర్చు చేసిందని, 90 శాతం నిధులు వెచ్చించాల్సిన సీమెన్స్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదని మీరంటున్నారు. ఈ కేసులో ఆర్థికపరమైన లావాదేవీలు జరిగినట్టుగా మీ దగ్గర ఆధారాలేమున్నాయి? సీమెన్స్ నుంచి చంద్రబాబు ఒక్క రూపాయి తీసుకున్నట్టు కూడా రిమాండ్ కాపీలో ఎక్కడా లేదు. ఒకవేళ చంద్రబాబుకు సీమెన్స్ లంచం ఇచ్చిందన్నది మీ ఆరోపణ అయితే... మీ దగ్గర ఆధారం ఉందా?' అని అర్నబ్ ప్రశ్నించారు. 
 
దానికి సూటిగా సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే... 'అదే సీఐడీ చూస్తోంది. దాన్నే నిరూపించాలనుకుంటోంది. దాని కోసమే విచారణ సాగుతోంది. చంద్రబాబు సహకరించడం లేదు' అని బదులిచ్చారు. నైపుణ్య కేంద్రాల వ్యవహారం చంద్రబాబు హయాంలోనే జరిగిందని దాన్ని కేబినెట్ ఎజెండాలో లేకుండా చివరి నిమిషంలో పెట్టి, ఆమోదించారని, అంత హడావుడిగా చేయాల్సిన అవసరమేమిటని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 
 
దానిపై అర్నబ్ స్పందిస్తూ... 'హడావుడి నిర్ణయం అంటే మీ వైకాపా సభ్యులకూ ప్రమేయం ఉందని ఆరోపణలున్న మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయం తీసుకున్నట్టా? అక్కడ కూడా ఆయన అంతే హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు' అని ప్రశ్నించారు. దాని గురించి తనకు అంతగా తెలియదని ఎమ్మెల్యే దాటవేశారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. కాగా, కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారనే ప్రచారం జాతీయ స్థాయిలో జరగుతుంది. దీంతో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైకాపా నేతలు లేనిపోని అంభాండాలు వేస్తున్నారనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు