ఇకపై పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టిచంపుడే : రేవంత్ రెడ్డి

ఆదివారం, 4 జులై 2021 (14:23 IST)
విపక్ష పార్టీల్లో గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీల్లోకి వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారంటూ మండిపడ్డారు. 
 
రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాక, ఇటీవల వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. దానిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన మాటల తూటాలను మళ్లీ పేల్చారు. తాను గతంలో ఇండిపెండెంట్‌గా గెలిచి ప్రతిపక్షంలో చేరానని వెల్లడించారు. అంతకుముందు జడ్పీటీసీగానూ ఇండిపెండెంట్‌గానే గెలిచానని తెలిపారు. 
 
అప్పుడు తాను కేసీఆర్‌కు సహకారం అందించానని, తెలంగాణ సాధన కోసమే అప్పట్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చానని రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పుడు తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని, త్వరలోనే ఘర్ వాపసీ కార్యాచరణ ఉంటుందన్నారు. దూకుడు తన సహజ లక్షణం అని, అది మారదన్నారు. పైగా, ఇక పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టిచంపుడేనని తన వైఖరిని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు