బెజవాడలో కలకలం... రౌడీషీటర్‌ను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు

సోమవారం, 2 జనవరి 2017 (09:31 IST)
బెజవాడలో ఓ రౌడీషీటర్‌ను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... అరండల్‌పేట విజయటాకీస్‌ సెంటర్‌లో నివసిస్తున్న షేక్‌నాగుల్‌ మీరా(40) గవర్నమెంట్ ఆసుపత్రిలో హెచ్‌ఐవి విభాగంలో కాంట్రాక్ట్‌పై స్వీపర్‌గా పని చేస్తున్నాడు. గతంలో ఇతనిపై పలు కేసులు ఉండడంతో సూర్యారావు పేట పోలీస్టేషన్‌లో రౌడీషీటు తెరిచారు. ఇతను పెజ్జోనిపేటలో ఉంటున్న మహిళతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్టు పుకార్లు ఉన్నాయి.
 
ఈ నేపతథ్యంలో ఆ మహిళకు అదే ప్రాంతానికి చెందిన క్యాటరింగ్‌ పని చేసే అనిల్‌తో పరిచయమైంది. ఈ విషయం తెలుసుకున్న నాగుల్‌మీరా ఆమెను మందలించాడు. అయినా ఆమె అతనితో చనువుగా ఉండటంతో చేయిచేసుకున్నాడు. జరిగిన విషయం ఆ మహిళ అనిల్‌తో చెప్పింది. అప్పటి నుంచి అతను నాగుల్‌మీరాపై పగపెంచుకున్నాడు. అదనుకోసం అనిల్‌ చూస్తున్నాడు. 
 
ఈ పరిస్థితుల్లో ఆదివారం మధ్యాహ్నం శైలజా థియేటర్‌ ఎదురు చాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ రోడ్డులో నాగుల్‌మీరా తాగిన మత్తులో ఉండగా అనిల్‌ స్నేహితులతో కలిసి వెంటపడి అతనిని కత్తులతో పొడిచారు. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడ నుంచి వారు పారిపోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి