చంద్రబాబు గుండె ఆగిపోతున్నట్టుగా నానా యాగీ చేస్తున్నారు : సజ్జల

గురువారం, 16 నవంబరు 2023 (15:28 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన గుండె ఆగిపోతునట్టుగా నానా యాగీ చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ హైకోర్టు సమర్పించిన వైద్య రిపోర్టులో చంద్రబాబుకు గుండె సమస్యలు ఉన్నాయని పేర్కొనడంపై సజ్జల స్పందించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు చర్మ వ్యాధులను కూడా ప్రాణాంతక వ్యాధులుగా చెప్పే ప్రయత్నం చేశారన్నారు. 
 
బయటికి వచ్చి చికిత్స చేయించుకోండి అని కోర్టు మానవతా దృక్పథంతో ఆదేశాలు ఇస్తే బయటకు రాగానే ఆయన 14 గంటల పాటు ప్రయాణం చేశారన్నారు. అడుగడుగునా కార్యకర్తలు వచ్చే వరకు వేచివుంటూ, లేకపోతే కార్యకర్తలు ముందే వచ్చేలా ఏర్పాటు చేసుకుని సాయంత్రం బయలుదేరితే మరుసటినాటి ఉదయం ఇంటికి చేరుకున్నారని అన్నారు. రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సివున్నా, వారి వైద్యులు హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఆయన మాత్రం విజయవాడకు వచ్చారని గుర్తు చేశారు. ఇపుడు ఆయనకు గుండె జబ్బు ఉన్నట్టుగా నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు