కరోనా భయం లేకుండా తేళ్ళ పండుగ ... శ్రీవారికి నైవేద్యంగా తేళ్లు.. ఎక్కడ?

మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:37 IST)
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి భయం ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. నలుగురు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలన్నా భయపడిపోతున్నారు. దీనికి కారణం కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న భయం. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ భయం లేకుండా గ్రామస్థులంతా కలిసి తేళ్ళ పండుగను జరుపుకున్నారు. పైగా, ఈ తేళ్ళను శ్రీవేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లాలోని కోడుమూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రతి యేడాది శ్రావణ మాసం మూడో సోమవారం తేళ్ళ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ గ్రామస్థులంతా కలిసి వరుస క్రమంలో కొండపై తేళ్లను గాలిస్తూ వెళతారు. అలా గాలింపు చర్యల్లో వారికి లభ్యమయ్యే తేళ్లను కొండపై వెలసిన శ్రీ కొండరాయుడు (శ్రీ వేంకటేశ్వర స్వామి)కి నైవేద్యంగా పెడుతారు. 
 
ముఖ్యంగా, కొండపైకి వెళ్ళే భక్తులు కొండ రాళ్ళ కింద తేళ్ళను పట్టుకుని వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత స్వామికి భక్తితో పూజలు చేసి దర్శనం చేసుకుంటారు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తున్న సమయంలోనూ వారు ఏమాత్రం భయపడకుండా తమ ఆచారాన్ని కొనసాగించారు. మిగిలిన రోజుల కంటే ఈ ఒక్క రోజు మాత్రం కొండపైకి వెళ్లే భక్తులు తేళ్లు ఎలాంటి హాని తలపెట్టవని కొడుమూరు గ్రామస్థులు చెబుతున్నారు. అంటే.. భక్తితో పాటు.. తేళ్ళపై వారికి అపారమైన భక్తి విశ్వాసమన్నమాట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు