అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్

ఠాగూర్

బుధవారం, 25 సెప్టెంబరు 2024 (10:45 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్ ఏర్పాటుకానుంది. ఇందుకోసం రూ.250 కోట్ల వ్యయం చేశారు. ఈ సెంటర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతం తెలిపింది. ఈ టెక్ సెంటర్ నిర్మాణం కోసం అవసరమైన 20 ఎకరాలను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ సెంటర్‌ను కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయాలని గత వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇపుడు ప్రభుత్వం మారడంతో ఈ సెంటర్‌ను అమరావతిలోనే నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 
 
అమరావతిలో రూ.250 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రాజధాని ప్రాంతంలోని 20 ఎకరాల భూమిని సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన తొలి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో గుంటూరు జిల్లాలో మరో సెంటర్ను ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
 
నిజానికి తొలుత దీనిని కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఏర్పాటు చేయాలని అప్పటి జగన్ ప్రభుత్వం కోరింది. అయితే, ప్రభుత్వం మారడంతో ఇప్పుడు దీనిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ప్రపంచస్థాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్‌తోపాటు వివిధ ఇంజినీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాములు అందిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు