విజయవాడలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి వెలంపల్లి

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (16:21 IST)
శుక్రవారం విజయవాడ బ్రాహ్మణ వీధి లొని దేవదాయ శాఖ మంత్రి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నియోజవర్గంలో రహదారుల అభివృద్ధి పనులను పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని, అందుకు ఈ నెల 20 తర్వాత  ప్రణాళిక రూపొందించుకోవాలని నగర పాలక సంస్థ అధికారులకు మంత్రి సూచించారు.
 
కాంట్రాక్టర్ తో సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో మార్కెట్, సామరంగ్ చౌక్, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లోని రహదారి పనులను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జెండా చెట్టు సెంటర్ నుంచి డ్రైవర్ను కెనాల్ వరకు పనులు పూర్తి చేసేందుకు పనులు చేపట్టాలన్నారు. 
 
ముఖ్యంగా వేసవికాలంలో నగరంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వాటర్ వర్క్స్ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను వివరించారు. 
 
పశ్చిమ నియోజకవర్గంలో సెక్టార్ వన్ లో 20  బూస్టర్ పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, వీటిని ఆపరేట్ చేసే సిబ్బందిని పోలీసుల అనుమతించడం లేదని మంత్రి దృష్టికి తీసుకురావడంతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఫోన్ లో నగర పోలీస్ కమిషనర్ తో మాట్లాడి వాటర్ సిబ్బంది విధులు నిర్వహించుకునే విధముగా అనుమతించాల్సిందిగా సూచించారు.
 
సమావేశంలో నగరపాలక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, సివిల్ వర్క్ డెప్యూటీ ఈ. ఈ. రవి కుమార్, వాటర్ వర్క్స్ డిఈ రంగా రావు, ఏ ఈ శాంతి కుమార్, రవీంద్ర, బషీర్ రెడ్డి, రాజేష్, అహ్మద్ తదితరులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు