ఎస్సై భవానీది హ‌త్యేనా? కుల సంఘంలో ఆందోళ‌న‌లు!

సోమవారం, 30 ఆగస్టు 2021 (11:16 IST)
సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరంలో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం కుల సంఘాల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఆమెది ఆత్మహత్య? హత్య అనేది తేల్చాల‌ని వారు డిమాండు చేస్తున్నారు. 
 
వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాకు పి టి సి ట్రైనింగ్ నిమిత్తం వెళ్లిన భవానీ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై భవానీ రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్ అయింది. అవివాహిత అయినా భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం. 
 
అగ్నికుల క్షత్రియ కులంలో జన్మించి, కష్టపడి చదివి స్వయంకృషితో యస్ ఐ గా ఉద్యోగం సాధించి, ధైర్యంగా  విధులు నిర్వహిస్తున్న కొపనాతి భవాని అస‌లు ఎలా చ‌నిపోయింద‌ని కుల సంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి. చనిపోయే అంత ఒత్తిడి చేసి, లేదా చంపేసి ఆత్మహత్య గా, ప్రేమ వ్యవహారంలాగా చిత్రీకరించటాన్ని జాతీయ అగ్నికులక్షత్రియ సంఘ అధ్యక్షులు నాగిడి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. 
 
డిపార్ట్మెంట్ లో యస్ ఐ గా  విధులు నిర్వహిస్తున్న వారికే ఇలా జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట‌నే స్పందించి, సిబిఐ దర్యాప్తు చేయించి, వారి కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.  లేని పక్షంలో  ప్రభుత్వం నిర్లక్ష్యనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు