కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు.. ప్రధాన అర్చకుడిపై వేటు..

బుధవారం, 3 జనవరి 2018 (09:32 IST)
సుప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో అర్థరాత్రి పూజలు జరిపినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన అర్చకుడిపై వేటు వేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంతో కనకదుర్గమ్మ గర్భాలయంలో తాంత్రిక పూజలు జరిపించారని.. ప్రత్యేక నైవేద్యంగా కదంబాన్ని తయారు చేయించారని ఆరోపణలు రావడంతో చర్యలు చేపట్టారు. ప్రధాన అర్చకుడు బదరీనాథ్‌ను కొండ దిగువ ఆలయానికి బదిలీ చేయించారు. 
 
ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నామని మంత్రి పైడికొండల ప్రకటించారు. డిసెంబర్ 26న అర్థరాత్రి వేళ విజయవాడ కనకదుర్గమ్మ గర్భాలయంలో ప్రత్యేక అర్చనలు, అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకరణ చేసి.. తాంత్రిక పూజలు జరిపించారని ఆరోపణలు వచ్చాయి. దీనిని తొలుత అలాంటివి జరగలేదని ఆలయ ఈవో చెప్పారు. 
 
గుడిని శుభ్రం చేసేందుకే అనుమతించామని చెప్పిన ఆలయ ఈఓ సూర్యకుమారి, వీడియో ఫుటేజ్‌లు బయటకు రావడం, అందులో కొత్త వ్యక్తులు కనిపించడంతో, మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ క్రమంలో ప్రధాన అర్చకుడిపై వేటు వేశారు.

అంతేగాకుండా ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని  దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలియజేశారు. ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభమైందని ఆయన తెలిపారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు