మూర్ఖ ప్రభుత్వం... కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తారా? అచ్చెన్నాయుడు ప్రశ్న

సోమవారం, 17 మే 2021 (12:30 IST)
సిబిసిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన రఘురామకృష్ణంరాజును వైద్యం కోసం రమేష్ ఆసుపత్రికి తరలించాలన్న సిఐడి కోర్టు ఆదేశాలను ఎపిసిఐడి పెడచెవినపెట్టి జైలుకు తరలించడంపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టడమేగాక వైద్యం కూడా అందించకుండా సిఐడి పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 
 
హృద్రోగంతో బాధపడుతున్న రఘురామను తీవ్రంగా కొట్టి హింసించడం దారుణం. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతోనే సిఐడి ఇటువంటి పాశవిక చర్యలకు పాల్పడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా వైద్యపరీక్షల నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందిన ఆదేశాల ప్రకారమే మెడికల్ బోర్డు నివేదిక అందించకుండా జాప్యం చేస్తున్నారు. నివేదికను తారుమారు చేశారు. ఎంపి రఘురామకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్, సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. 
 
రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర వహిస్తున్న పెద్దలు, కొందరు పోలీసు అధికారుల వల్ల తనకు ప్రాణహాని ఉందని గతంలోనే రఘురామ కేంద్రప్రభుత్వానికి విన్నవించడంతో వై కేటగిరి భద్రత కల్పించింది. సిఐడి పోలీసులు అత్యంత అమానవీయంగా రఘురామపై చేసిన లాఠీచార్జిపై ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులు కేంద్ర హోంశాఖకు తెలియజేశారు. 
 
తమ భర్తను చంపడానికి పథకం సిద్ధం చేశారని రఘురామ కృష్ణంరాజు భార్య ఆందోళన వ్యక్తంచేస్తోంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి జైలుకు తరలించిన సిఐడి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రఘురామపై పోలీసులు విచక్షణా రహితంగా చేసిన దాడి, కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై మానవహక్కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు స్పందించాలి. తక్షణమే రఘురామ కృష్ణంరాజుకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశంపార్టీ డిమాండ్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు